పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే హడావుడి , అతి మిగతా అభిమానులతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. వన భోజనాల పేరుతో జరిగే సామాజిక వర్గాల సమావేశాల్లో పవన్ ఫొటోలు, ఫ్లెక్సీలు పెట్టడం నాలుగైదేళ్లుగా బాగా ఎక్కువైంది. దీనికి చరమగీతం పాడేందుకు స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. సామాజిక మాధ్యమాల్లో వనభోజనాలపై కాస్త ముందుగానే స్పందించారు.
"జనసేన నాయకులందరికీ విన్నపం. కార్తీకమాసం వనభోజనాలు మీరు కావాలనుకుంటే వ్యక్తిగతంగా జరుపుకోండి. కానీ నా పేరుమీద కానీ, జనసేన పార్టీ పేరుమీద కానీ జరపవద్దని నా మనవి". అని సూచిస్తూ అక్కాచెల్లెళ్లకు, ఆడపడుచులకు కార్తీకమాసం శుభాకాంక్షలు చెప్పారు. దీన్నిబట్టి చూస్తే పవన్ ని వన భోజనాలు ఎంతలా భయపెట్టాయో అర్థమవుతోంది. తాను అందర్నీ కలుపుకొని పోవాలని, అందరివాడుగా పేరు తెచ్చుకోవాలని ఎంత ట్రై చేస్తున్నా ఎక్కడో ఒక చోట పవన్ పై బ్లాక్ మార్క్ పడుతూనే ఉంది. ఆమధ్య ఓట్ల గల్లంతు విషయంలో కూడా కొంతమంది మహిళలు తమ ఓట్లు తొలగించారని ఫిర్యాదు చేసే క్రమంలో పవన్ పేరు చెప్పి, ఆయన తమ కులం కాబట్టి ఆయనకే ఓటు వేస్తామని బహిరంగంగానే స్పష్టంచేశారు.
పవన్ తమ కులం, ఆయనకు ఓటేస్తామని చెప్పడం వల్లే తమ ఓట్లు తీసేశారని మహిళలు వాపోయారు. ఈ ఆవేదనలో కూడా కుల సమీకరణాలు కనపడటంతో పవన్ ఇరుక్కుపోయారు. ఇప్పటికే రాయల్ అనే ట్యాగ్ లైన్ తో జనసేన కార్యకర్తలు పవర్ స్టార్ అభిమానులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. దీన్ని ప్రతిపక్షాలు ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నాయో, పవన్ ని ఎలా కార్నర్ చేస్తున్నాయో అందరికీ తెలుసు. అందుకే పవన్ ఈసారి వనభోజనాలపై కాస్త ముందుగానే ఎలర్ట్ అయ్యారు. ఎన్నికల వేళ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.