కేరళాలోని శబరిమలలోని అయ్యప్ప స్వామిని మహిళలు దర్శించుకోవచ్చన కోర్టు నిర్ణయంతో పలువురు మహిళలు స్వామివారి దర్శనానికి బయలు దేరారు. అక్కడ సనాతన ధర్మాన్ని బుగ్గి పాలు చేస్తున్న ఈ తీర్పుకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో మహిళలు, అయ్యప్ప భక్తులు ఆ మహిళలను అడ్డుకున్నారు..ఇది కాస్త దేశ వ్యాప్తంగా సంచలన టాపిక్ అయ్యింది. తాజాగా భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ ఈ నెల 17న శబరిమల ఆలయానికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తనకు తగినంత భద్రత కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు లేఖ రాశారు.
శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకునేంత వరకూ తాను కేరళను వదిలి మహారాష్ట్రకు పోబోనని భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చిక్కుకున్న ఆమె, ఓ వీడియో సందేశాన్ని మీడియాకు పంపారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కేరళా ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపింది. తాను తెల్లవారుజామున ఇక్కడకు చేరుకున్నానని, బయట నిరసనకారులు ఎక్కువగా ఉండటంతో, పోలీసులు తమను నిలిపివేశారని తెలిపారు.
మరో గేటు గుండా బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించగా, తనపై కొందరు దాడికి ప్రయత్నించారని, దీంతో వెనక్కు వచ్చేశామని చెప్పారు. ప్రస్తుతం మేమున్న ప్రదేశానికి చుట్టు పక్కల చాలా మంది నిరసన చేస్తున్నారని..నిరసన తగ్గుముఖం పట్టిన తర్వాత తనను, తన బృందాన్ని బయటకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారని, ప్రస్తుతానికి వారి మాటలను విశ్వసిస్తున్నానని తృప్తి అన్నారు. 17న తాను శబరిమలకు వెళ్తున్నానని... ఈ క్రమంలో తనకు ఏదైనా జరిగితే కేరళ ముఖ్యమంత్రి, డీజీపీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.
17వ తేదీన శబరిమల ఆలయం తిరిగి తెరుచుకుంటోంది. మరోవైపు, 500 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ఇప్పటికే రిజిష్టర్ చేయించుకున్నారు. మరోవైపు తృప్తి దేశాయ్ వస్తుందన్న విషయం తెలుసుకొని ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు..ఈ నేపథ్యంలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.