గత కొంత కాలంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు వరుసగా చేదు అనుభవాలు.. హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల మద్దతు తో తాను సీఎం పదవిలోకి వచ్చానని..అందుకే తనపై కొంత మంది నేతలు కక్ష్య కట్టారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. సామాన్యుడిగా ఉన్న తాను సీఎం స్థాయికి రావడం కొంత మంది నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయనపై పలుమార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ మద్య సీఎం ఛాంబర్ ఆఫీస్ ఎదుట కేజ్రీపై కారం చల్లి పదిరోజులు కూడా గడవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
మంగళవారం ఢిల్లీ సీఎం కేజ్రీ అపాయింట్మెంట్ ఇచ్చిన వారిని వరుసగా ఆయన నివాసంలో భేటీ అవుతున్నారు. ఇంతలో ఇమ్రాన్ అనే ఓ వ్యక్తి సీఎంను కలిసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నాడు. వక్ఫ్ బోర్డు తరపున తనకు వస్తున్న జీతం పెంచడం విషయంలో సీఎంను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నాడు. అతడ్ని తనిఖీ చేసిన అధికారులు అతడి వ్యాలెట్లో లైవ్ బుల్లెట్ను గుర్తించారు. వెంటనే ఇమ్రాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని మస్జిద్ బావ్లీ వాలీకి ఇమ్రాన్ కేర్ టేకర్ గా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
కాగా, ఇమ్రాన్ మాత్రం మసీదులో డోనేషన్ బాక్స్లో తనకు బుల్లెట్ దొరికిందని చెబుతున్నాడు. దీంతో అది జేబులో పెట్టుకొని ఆ విషయం మరిచిపోయానన్నాడు. అయితే పోలీసులు మాత్రం ఇమ్రాన్ తీరుపట్ల అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ మద్య తన ప్రాణాలకు ముప్పు ఉందని సీఎం కేజ్రీవాల్ ఉందని చెప్పిన విషయం తెలిసిందే.
రెండేళ్లలో నాలుగుసార్లు ..ఏ ముఖ్యమంత్రిపై కూడా దాడులు జరగలేదన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సీఎం కేజ్రీవాల్పై జరుగుతున్న వరుస దాడుల్ని ఖండించింది.కేజ్రీ చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శిస్తున్నారు ఆప్ నేతలు. ఢిల్లీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేని ప్రధాని మోదీ గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు.