రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వాతావరణం ప్రజలను రాజకీయ నాయకులను ఎంతగానో వేడెక్కిస్తుంది. ముఖ్యంగా ముందుగా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7 న జరగబోయే అసెంబ్లీ ఎన్నిక విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ మరియు మహా కూటమి పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. రానున్న ఎన్నికల్లో కేసిఆర్ పార్టీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పార్టీని కలుపుకొని ఏకం చేసి ప్రజా కూటమి అని పేరు పెట్టి టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి అన్ని విధాల రెడీ అవుతున్నారు.
ముఖ్యంగా ఈ మహా కూటమి ఏర్పడటానికి ముందునుండి కృషి చేసిన ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పై టిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ తీవ్ర స్థాయిలో తన ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ ని లేపడానికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి చంద్రబాబు వెంట రావాలని చూస్తున్నారని..కానీ కేసీఆర్ ఆ ఛాన్స్ ఇవరని..కేసీఆర్ను గద్దె దించడం చంద్రబాబు వల్ల కాదని, ఆయన చేస్తున్న కుటిల ప్రయత్నాలు ఫలించవని నాయిని అన్నారు.
ఇక ఏపీలో కూడా టీడీపీ పూర్తిగా తుడుచుకుపోతుందని, వచ్చే ఏడాది వైసీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తరిమేస్తే ఏపీ అభివృద్ది పయనంలో నడుస్తోందని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.