జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణలో
కేంద్రంపై హై కోర్టు మండిపడింది. గోడమీద పిల్లి వాటంలాగ వ్యవహరిస్తున్నందుకు
కోర్టు కేంద్రంపై సీరియస్ అయ్యింది. ఎన్ఐఏ తో విచారణ చేయించే విషయంలో కోర్టు అడిగిన
అభిప్రాయానికి కేంద్ర సూటిగా చెప్పకపోవటమే కోర్టు ఆగ్రహానికి కారణమైంది. జగన్ పై
హత్యాయత్న కేసు విచారణలో భాగంగా వారం క్రితం కేంద్రాన్ని కోర్టు నేరుగానే
ప్రశ్నించింది. కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించే విషయంలో అభిప్రాయం చెప్పమంటూ
కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సమాధానం చెప్పటానికి వారం రోజుల గడువు కూడా
ఇచ్చింది.
అయితే వారం రోజుల గడువు పూర్తయిన కారణంగా ఈరోజు కేసు విచారణకు వచ్చింది. కేంద్రం కోర్టుకిచ్చిన సీల్డ్ కవర్ సమాధానాన్ని న్యాయమూర్తి చదివారు. విషయం బయటకు రాకపోయినా కేంద్రంపై న్యాయమూర్తి సీరియస్ అయిన విధానాన్ని బట్టి జగన్ తరపున లాయర్ సమాధానం ఏమై ఉంటుందో ఊహించారు. అదే విషయాన్ని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎన్ఐఏ తో విచారణ చేయించే అంశంపై కేంద్రం గోడమీద పిల్లివాటంగా వ్యవహరించినట్లు అభిప్రాయపడ్డారు. అందుకే కోర్టు కూడా సీరియస్ అయ్యిందన్నారు.
ఎన్ఐఏ విచారణపై నిర్ణయాన్ని కేంద్రం తానుగా తీసుకోకుండా హైకోర్టు నిర్ణయానికే వదిలేసినట్లుగా ఉందని పొన్నవోలు చెప్పారు. అంటే కోర్టు ఆదేశాలతోనే ఎన్ఐఏను రంగంలోకి దింపాలని కేంద్రం భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక్కడే అనవసర జాప్యం జరుగుతోంది. కోర్టు సూటిగా అడిగింది కాబట్టి, ఎలాగూ ఘటన జరిగిన ప్రదేశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదే కాబట్టి ఎన్ఐఏ విచారణకు కేంద్రం ఆదేశించవచ్చు. లేకపోతే కేసును కేంద్ర దర్యాప్త సంస్ధ ద్వారానే విచారణ చేయించాలని కోర్టు ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది కాబట్టి నేరుగా కోర్టు కూడా ఆదేశించవచ్చు. కానీ రెండింటిలో ఏదీ జరగటం లేదు. కోర్టు కేంద్రాన్ని అడుగుతోంది. కేంద్రమేమో కోర్టు నిర్ణయానికే వదిలేస్తోంది. తాజాగా మరో నాలుగు రోజుల సమయం ఇచ్చింది. ఈ దోబూచులాటేంటో అర్ధం కావటం లేదు. దీని వల్ల సమయం వృధా తప్ప మరేం జరిగేదుండన్న విషయం అర్ధమైపోతోంది.