5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్న బీజేపీ తీవ్ర విషాదం లోకి వెళ్లిపోయింది. మరో 6 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జరిగిన సెమీఫైనల్స్ లో ఓటమి ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి పెద్ద ఊరట లభించింది. తమ పాలనపై పడ్డ అవినీతి మచ్చ విషయంలో మోదీ సర్కార్ కు బూస్ట్ దొరికింది. ఎన్నికల విషాదం నుంచి బయటపడేందుకు ఈ బూస్ట్ కొంతవరకూ ఉపయోగపడడం ఖాయం.
నాలుగున్నరేళ్లుగా మోదీ సర్కార్ అవినీతిరహిత పాలన అందిస్తోందటూ బీజేపీ చెబుతూ వస్తోంది. అయితే రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈ అంశంపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా సంతృప్తి రాలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రూపంలో బీజేపీకి పెద్ద లభించింది. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒప్పందాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని.. దేశ రక్షణ దృష్ట్యా దీన్ని ఇంతటితో ఆపేస్తే మంచిదని వెల్లడించింది.
రఫేల్ ఒప్పందంలో అనుమానించాల్సిందేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీర్పును చదివి వినిపించిన ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్.. చిన్న చిన్న క్లాజులను మార్పు చేసినంత మాత్రాన ఒప్పందం మొత్తాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో నిర్ణయించిన 126 యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారం కొలిక్కి రాకపోవడం వల్లే 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియ మొదలైందని స్పష్టంచేశారు. వాణిజ్యపరంగా ఈ ఒప్పందం మరింత ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నందున.. జాతీయ భద్రత దృష్ట్యా ఇంతకు మించి ఇంకేం చేయలేం.. అని ప్రధాన న్యాయమూర్తి తేల్చిచెప్పారు.
ఫ్రాన్స్ కు చెందిన దసో కంపెనీ నుంచి 36 యుద్ద విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, 59వేల కోట్ల రూపాయల ఈ ఒప్పందంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ప్రశాంత్ భూషణ్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.
ఫ్రాన్స్ కు చెందిన దసో కంపెనీ నుంచి 36 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేసుకునేందుకు భారత రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం అవతకవకలమయమైనీ.. పలు అనుమానాలకు తావిచ్చేలా ఈ ఒప్పందం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ కు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి నిజానిజాలు వెల్లడించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. అసత్య ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ సహా మిగిలినవారంతా దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించి తనపైన, తన కంపెనీ పైన వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిపోయిందని అనిల్ అంబానీ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో మోదీ, బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. సుప్రీం తీర్పులో వైరుధ్యం ఉందని ఆ పార్టీ నేత ఆనంద్ శర్మ అన్నారు. ఒప్పందం వ్యవహారాల్లోకి తాము వెళ్లలేమని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని.. క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన వివరించారు.