దివంగత ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు హత్య కేసు దర్యాప్తును ఎన్ఐఏ
విచారణకు తీసుకోవటం ద్వారా కేంద్రం చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చింది. దాదాపు
ముగిసిపోయిన హత్య కేసునే కేంద్రం ఎన్ఐఏ విచారణకు ఆదేశించిన నేపధ్యంలో సంచలనం
సృష్టించిన ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును కూడా
ఎన్ఐఏకి బదిలీ చేయనున్నదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అదే జరిగితే సరిగ్గా
ఎన్నికలకు ముందు చంద్రబాబుకు కష్టాలు తప్పవనే భావనే అందరిలోను మొదలైంది.
ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు హత్య కేసు ఎన్ఐఏకి బదిలీ అయ్యింది. సెప్టెంబర్ 23వ తేదీన అరకు నియోజకవర్గంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో మావోయిస్టులు దారికాచి మరీ పక్కకు తీసుకెళ్ళి కాల్చి చంపిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎంఎల్ఏను మావోయిస్టులు కాల్చి చంపటమన్నది అప్పట్లో దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఎందుకంటే, ఇటీవల కాలంలో ఓ ప్రజా ప్రతినిధిని అందునా గిరిజన ఎంఎల్ఏని మావోయిస్టులు హత్య చేసింది లేదు. సరే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హత్యాయత్నం ఘటనపై దర్యాప్తుకు సిట్ ను నియమించింది.
కేసును విచారించిన సిట్ కూడా హత్యచేసింది మావోయిస్టులే అంటూ తేల్చేసింది. హత్యకు సహకరించిన సొంత పార్టీ నేతలను కూడా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య చేసింది తామేనంటూ తర్వాత మావోయిస్టులు కూడా ఓ లేఖను విడుదల చేశారు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కిడారి హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చేసినట్లే. కాల్చి చంపిన మావోయిస్టులను సిట్ అధికారులు గుర్తించారు. హత్యకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. దానికి ఆధారంగా మావోయిస్టు నేతలకు, స్ధానిక గిరిజన నేతలకు మధ్య జరిగిన సెల్ ఫోన్ కాల్ లిస్టును కూడా సంపాదించారు. స్ధానిక నేతలు కూడా తమ పాత్రను అంగీకరించారు.
ఇదంతా చరిత్ర అనుకోండి అది వేరే సంగతి. విచారణ కూడా ముగిసిందని అందరూ అనుకుంటున్న సమయంలో కిడారి హత్యకేసును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించటం విచిత్రంగా ఉంది. హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్ధతో విచారణ చేయించాలని రాష్ట్రప్రభుత్వం ఏనాడు అనుకోలేదు. కేంద్ర దర్యాప్తును కూడా అసలు ఎవరు కోరలేదు. చనిపోవటం అన్నది బాధారకే అయినా కిడారి మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న విషయం అందరికీ తెలుసు. మరి ముగిసిన హత్య కేసునే కేంద్రం ఎన్ఐఏ విచారణ పరిధిలోకి తీసుకున్నపుడు మిస్టరీగా ఉన్న జగన్ పై హత్యాయత్నం కేసును కూడా ఎన్ఐఏ పరిధిలోకి తీసుకుంటుందేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. దానికితోడు థర్డ్ పార్టీ విచారణ కోరుతూ జగన్ వేసిన పిటీషన్ పై కోర్టులో విచారణ జరుగుతోంది.
ఒకవేళ జగన్ కోరుతున్నట్లుగా కోర్టు గనుక విచారణను ఎన్ఐఏకో లేకపోతే సిబిఐ చేతికో అప్పగిస్తే చంద్రబాబుకు కష్టాలు తప్పవు. ఎందుకంటే, హత్యాయత్నం కేసులో అనుమానాలన్నీ టిడిపి నేతలపైనే ఉన్నాయి. కానీ సిట్ విచారణ మాత్రం టిడిపి నేతల్లో ఎవరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేయలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే కేసు విచారణను రాష్ట్రప్రభుత్వం నీరు గారుస్తోందని అర్ధమైపోతోంది. అందుకే విచారణ కేంద్రం పరిధిలోకి వెళిపోతే కుట్ర వెనుక సూత్రదారులు బయటపడతారు. అది కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగితే చంద్రబాబు పరిస్దితి ఎలాగుంటుందో ?