వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా పులివెందులలో జగన్మోహన్
రెడ్డికి ప్రత్యర్ధిగా జనసేన తరపున పోటీ చేయబోతున్నదెవరో తెలుసా ? పులివెందుల
నివాసే అయిన పేర్ల పార్ధసారధి రెడ్డి. బహుశా ఈ పేరును చాలామంది వినికూడా ఉండరు.
ఎందుకంటే పేర్ల ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీలోను యాక్టివ్ గా లేరు కాబట్టి. ఇంతకీ
పేర్ల ఎవరు ? ఎవరంటే, వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు. దివంగత
ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి పై 1998లో ప్రత్యర్ధులు బాంబులతో
దాడి చేసి కత్తులతో నరికి చంపేశారు.
అప్పట్లో పోలీసులు 11 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
సంవత్సరాల తరబడి కేసు విచారణ తర్వాత పేర్ల పార్ధసారధిరెడ్డి, సతీష్ రెడ్డిల పాత్రపై తగిన ఆధారాలు లేవంటూ కోర్టు వారిద్దరినీ విడుదల చేసింది. మిగిలిన 9మందికి యావజ్జీవ శిక్ష విధించిందనుకోండి అది వేరే సంగతి. విడుదలైన ఇద్దరు టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే సతీష్ రెడ్డి కి అవకాశాలొచ్చాయి. వైఎస్ పై ఒకసారి పులివెందులలో అసెంబ్లీకి కూడా పోటీ చేయటంతో పార్టీలో సతీష్ పేరు బాగా పాపులర్ అయ్యింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో సతీష్ ఎంఎల్సీ అయి శాసనమండలికి డిప్యుటి ఛైర్మన్ కూడా అయ్యారు.
అయితే, ఎంత కాలం ఎదురుచూసినా పేర్లను ఎవరు పట్టించుకోలేదు. దాంతో టిడిపిలో ఇక లాభం లేదనుకుని ఈమధ్యలోనే జనసేనలో చేరారు. జనసేనలో పేర్ల చేరగానే గుర్తింపొచ్చేసింది. ఎందుకంటే, వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో నిందుతుడు. పైగా టిడిపిలో నుండి వచ్చేశారు. అంతేకాకుండా వైఎస్ కుటుంబానికి అత్యంత బద్ధ విరోధి. రేపటి ఎన్నికల్లో జగన్ పై పోటీ చేయటానికి ఇంతకన్నా గట్టి అభ్యర్ధి ఎవరు దొరుకుతారు జనసేనకు ? అందుకే వెంటనే పేర్ల పార్ధసారధి పేరును పులివెందులకు ఖాయం చేసేశారట పవన్.
తెలుగుదేశంపార్టీ తరపున జగన్ ప్రత్యర్ధిగా బహుశా ఎంఎల్సీ బిటెక్ రవినే పోటీ చేయొచ్చు. జనసేన తరపున పేర్ల పార్ధసారధిరెడ్డి కూడా దాదాపు ఖాయమే కాబట్టి పులివెందులలో పోటీ త్రిముఖమని అర్ధమవుతోంది. పులివెందులలో అభ్యర్ధిని ఖరారు చేయటంతో జనసేన తరపున రెండు టిక్కెట్లు ఖాయమైనట్లే. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణను స్వయంగా పవనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పులివెందులలో కూడా టిక్కెట్టు ఫైనల్ అవ్వటంతో త్రిముఖ పోటీ ఏ స్ధాయిలో జరుగుతుందో చూడాల్సిందే.