టిక్కెట్లు ప్రకటించే గడువు దగ్గర
పడేకొద్దీ అనంతపురం జిల్లాలోని ఐదుగురు ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రాబోయే
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టిక్కెట్లను ముందే ప్రకటిస్తానని స్వయంగా
చంద్రబాబునాయుడే చెప్పారు. అందుకు ముహూర్తంగా సంక్రాంతి పండుగను ఎంచుకున్నారు
చంద్రబాబు. పండగ అయిపోగానే 175 అసెంబ్లీ టిక్కెట్లకు గాను మొదటి జాబితాలో కనీసం 70
మంది అభ్యర్ధులను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు.
దాంతో ముందస్తు జాబితాలో ఉండే పేర్లేవనే విషయంలో ఎంఎల్ఏల్లో ఊహాగానాలు పెరిగిపోతున్నాయ్. దానికితోడు ఈరోజు జరుగుతున్న సమన్వయ కమిటి సమావేశంలో కూడా ఇదే విషయమై చర్చ జరుగుతోంది. సరే చంద్రబాబు ప్రకటననే ప్రమాణికంగా తీసుకుంటే ముందుగా ప్రకటించే 70 సీట్లలో ప్రతీ జిల్లాకు సుమారుగా 5 మంది అభ్యర్ధులుంటారని అంచనా. ఆ ఐదుమందే ఎవరు ? అన్న విషయంలోనే ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు.
ఇక, అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఈమధ్యనే జిల్లాలోని ఐదుగురు ఎంఎల్ఏల పనితీరుపై చంద్రబాబు మండిపడ్డారు. పోయిన ఎన్నికల్లో ఈ జిల్లా టిడిపికి ఎంతగా మద్దతుగా నిలబడ్డదో ఇపుడంత గబ్బు పట్టిపోయింది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో తీసుకున్నా వర్గ విబేధాలు తీవ్రస్ధాయిలో పెరిగిపోయింది. చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నా వివాదాలు సర్దుబాటు కాలేదు. నాలుగున్నరేళ్ళలో సర్దుబాటు కాని వివాదాలు చివరి ఐదు నెలల్లో అవుతాయన్న ఆశకూడా ఎవరిలోను లేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఈ జిల్లాలో నాలుగు సీట్లు వచ్చేది కూడా అనుమానంగా తయారైంది.
అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డి ఇదే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడుతూ ఎంఎల్ఏలను మార్చకపోతే జిల్లాలో 10 సీట్లు ఓడిపోతాయమని చెప్పటం అందరికీ తెలిసిందే. జేసి ప్రకటనపై ఎంఎల్ఏలు, మంత్రులు మండిపడుతున్నా వాస్తవం అంతకన్నా భిన్నంగా ఏమీ లేదని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.చంద్రబాబు సమీక్షించిన పుట్టపర్తి, మడకశిర, శింగనమల, కల్యాణదుర్గం, కదిరి, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఐదుగురికి టిక్కెట్లు దక్కదని పార్టీ నేతలే చెబుతున్నారు.
అందుకనే పుట్టపర్తి ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డి, మకడశిరలో ఈరన్న రాజీనామా చేశారు. శింగనమల ఎంఎల్ఏ యామినీబాల, కల్యాణదుర్గం ఎంఎల్ఏ హనుమంతరాయచౌదరి, గుంతకల్లు ఎంఎల్ఏ జితేంద్రగౌడ్, కదిరి ఫిరాయింపు ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాషలు చంద్రబాబు దృష్టిలో పడేందుకు నానా అవస్తలు పడుతున్నారు. ఆరుగురు ఎంఎల్ఏల్లో ఐదు నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఇఫ్పటికే నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. దానికి తగ్గట్లే ద్వితీయ శ్రేణి నేతలు కూడా టిక్కెట్ల కోసం ఎంఎల్ఏలతో పోటీ పడుతున్నారు. కాబట్టి ఎంఎల్ఏల మార్పు తప్పదని అర్ధమైపోతోంది.