ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సహనం చాలా ఎక్కువంటారు. ఆయన దేనికీ అంత తొందరగా కోపం తెచ్చుకోరు. ఆయన ఓపికను ఇక్కడే అంతా మెచ్చుకుంటారు. ఎటువంటి సవాళ్ళు ఎదురైనా ఆవేశం కంటే ఆలొచనకే చంద్రబాబు పదును పెడతారు. అటువంటి చంద్రబాబుకు ఎపుడైన కోపం వచ్చింది అంతే అది కచ్చితంగా ప్రళయమే అవుతుంది.
పార్టీలో ఎమెర్జెన్సీ :
తెలుగుదేశం పార్టీలో ఇపుడు ఎమెర్జెన్సీ విధించారు. ఇది ఆరు నెలల పాటు కొనసాగుతుందట. ఈ విధయాన్ని స్వయంగా చంద్రబాబే పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తెలియచేశారు. ఆరు నెలల కాలంలో ప్రతి వారు పార్టీకి అంకితమై పని చేయాలని, పార్టీ తప్ప వేరే వూసు, ధ్యాస ఉండకూడని బాబు గట్టి ఆదేశాలే ఇచ్చ్చారు. పార్టీ సమావేశంలో బాబు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నాయకుల తీరు పట్ల కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందుకిలా :
తెలుగుదేశం పార్టీ అధినేత ఎందుకిలా చేశారన్నది ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. ఓ వైపు ఎన్నికలు ముంచుకువస్తూంటే నాయకులు, కొందరు మంత్రుల తీరు ఇంకా గాడిన పడలేదని బాబు చండ్ర నిప్పులు కురిపిస్తున్నారు. ఎన్నికలకు పట్టుమని నాలుగు నెలలు కూడా గడువు లేని వేళ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడాన్ని బాబు ప్రశ్నిస్తున్నారు ఇది ఇలాగే సాగితే ముప్పేనంటూ హెచ్చరికలు పంపుతున్నారు.
చాలా మంది నాయకులు, మంత్రులు అంతా చంద్రబాబే చూసుకుంటారని భావిస్తూ పెద్దగా పార్టీ గురించి పట్టించుకోవడంలేదు అటువంటి వారికి మాత్రం చంద్రబాబు ఉగ్ర రూపమే చూపుతున్నారు వచ్చే ఎన్నికలు ఢీ అంటే ఢీ అన్న తరహాలో సాగుతాయని తెలిసి కూడా కాడి వదిలేస్తే ఎలా అన్నదే బాబు ఆవేశంలోని ఆవేదనగా ఉందంటున్నారు.