దేశవ్యాప్తంగా ఇప్పుడు పార్టీలన్నీ పొత్తులకోసం వెంపర్లాడుతున్నాయి. అధికార బీజేపీని గద్దె దింపేందుకు సిద్దాంతాలు, విలువలతో పనిలేకుండా ఏకతాటిపైకి వస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ కూడా తెరవెనుక తీవ్రంగానే మంతనాలు చేస్తోంది. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తోంది. దేశంలోనే కాదూ.. ఏపీలోనూ ఇదే పరిస్థితి..!
నాలుగేళ్లపాటు బీజేపీతో దోస్తీ చేసి ఇటీవలే బయటికొచ్చిన చంద్రబాబు.. తాజాగా కాంగ్రెస్ తో హ్యాండ్ కలిపారు. అంతటితో ఆగని చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని పార్టీలనూ ఏకం చేసేందుకు నడుం బిగించారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాలూ తిరుగుతూ భావసారూప్యం కలిగిన పార్టీలతో చర్చలు జరిపుతున్నారు. ఎస్పీ, బిఎస్పీ.. తృణమూల్, కమ్యూనిస్టులు.. ఇలా అన్ని పార్టీలనూ ఏకం చేస్తున్నారు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా జాతీయస్థాయిలో పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి..
జాతీయ స్థాయిలో ఏర్పాటవుతున్న కూటములకు విలువలతో, పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేనట్టే కనిపిస్తోంది. బీజేపీని గద్దె దించడమే ఆ పార్టీల ఏకైక లక్ష్యం. ఎవరు ఎవరితో పొత్తు కడతారో, అది ఎన్నికల ముందు జరుగుతుందో, ఎన్నికల తరువాత జరుగుతుందో తెలియదు. ఈ కూటమిపై బీజేపీ అప్పుడే వాగ్బాణాలు సంధిస్తోంది. సింహాన్ని ఎదుర్కోవడానికి చిట్టెలుకలన్నీ ఏకమవుతున్నాయని దుయ్యబడుతోంది. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీయేలోని పార్టీలు చేజారిపోకుండా జాగ్రత్తపడుతోంది. అదే సమయంలో అవసరమైతే మరికొన్ని పార్టీలను కూటమిలో చేర్చుకోవడమో.. లేకుంటే మద్దతు తీసుకోవడమో లక్ష్యంగా పావులు కదుపుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో అటు వైసీపీ, ఇటు జనసేనతో బీజేపీ టచ్ లో ఉందనే ప్రచారం జోరందుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, జనసేన కూడా మొదట్లో బీజేపైపీ ఉన్న దూకుడు లేకపోవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. ఇదే ఇప్పుడు టీడీపీ అస్త్రమవుతోంది. బీజేపీ, వైసీపీ, జనసేన ఒక్కటయ్యాయని.. మోదీ డైరెక్షన్ లోనే ఆ పార్టీలు నడుస్తున్నాయని విమర్శిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం.. ఇప్పుడు అదే పార్టీతో దోస్తీ కట్టడాన్ని విపక్షాలకు గట్టి అస్త్రంగా మారింది. దశాబ్దాలపాటు కాంగ్రెస్ పై పోరాటం చేసిన టీడీపీ.. ఇప్పుడు ఆ పార్టీతో కలిసి కూటమి కట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తోంది. అంతేకాక.. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు స్నేహం చేసి.. మళ్లీ ఆ పార్టీకి ఊపిరి పోస్తున్నారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు.
తెలంగాణ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశాలు తక్కువే. యితే ఫ్రెండ్లీ పైట్ ఉండొచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పడంతో ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకే చంద్రబాబు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ పార్టీల సిద్ధాంతాలతో పనిలేదు.. అధికారాన్ని కాపాడుకోవడం, రాష్ట్రానికి హోదా తీసుకురావడమే చంద్రబాబు లక్ష్యం. ఇక వైసీపీ కూడా బీజేపీని పల్లెత్తుమాట అనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హోదాపై మాట్లాడకపోవడం, మోదీని విమర్శించకపోవడం.. లాంటి పరిణామాలు ఆ పార్టీ వైఖరిని తప్పుబట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇక జనసేన విషయానికొస్తే.. హోదాకోసం ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీలను ఏకతాటిపైకి వచ్చి పోరాడతానన్నారు పవన్ కల్యాణ్. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకపోయింది. పైగా వైసీపీ, జనసేనలను కలిపి పోటీ చేయించడం ద్వారా టీడీపీని ఇరుకున పెట్టాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టు టాక్. ఇందుకు కేసీఆర్ హెల్ప్ తీసుకుంటున్నారనేది లేటెస్ట్ మాట.
ఇలా పొత్తులపై దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇవి ఎంతవరకూ ఫలిస్తాయో.. ఏవి నిలబడతాయో.. ఏవి కూలిపోతాయో తెలియాల్సి ఉంది. అధికార వ్యామోహంతో కాకుండా కొన్ని అంశాలలో రాజీపడి ముందుకెళ్తో పొత్తులు సక్సెస్ అవుతాయని కర్నాటక ఉదాహరణ తెలియజేస్తోంది. మరి ఈ ఎగ్జాంపుల్ ఎంతవరకూ పార్టీలు ఆదర్శంగా తీసుకుంటాయనేది చూడాలి మరి.