న్యూ ఇయర్ జోష్ మొదలైపోయింది. ఈ సారి మరింత జోష్ తో ఎంజాయ్ చేయడానికి యూత్ సిద్ధమైంది. తమదైన శైలిలో న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు యువతీ యువకులు. మరోవైపు పోలీసులు కూడా జోష్ కి బ్రేక్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. రూల్స్ తప్పితే అంతే సంగతులంటూ హెచ్చరిస్తున్నారు.
న్యూ ఇయర్ వేడుకలంటే యూత్ ఎలా రెడీ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ లో ఈ జోష్ మామూలుగా ఉండదు. థర్టీ ఫస్ట్ నైట్ ఒక్క రోజే కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే న్యూ ఇయర్ ఈవెంట్ ను నిర్వహించేందుకు రిసార్ట్స్, రెస్టారెంట్స్, హోటల్స్, పబ్స్ ముస్తాబయ్యాయి. ఈ సారి వేడుకలకు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయనేది టాక్.
అయితే.. వేడుకల మాటున అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు హెచ్చరిస్తూ వస్తున్నారు. డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తప్పవని.. నిబంధనలకు లోబడి ఈవెంట్లు నిర్వహించాలని నిర్వాహకులకు సూచిస్తున్నారు. డ్రగ్ మాఫియాకు చెక్ పెట్టేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. పోలీసుల నిఘా నీడలో ఈవెంట్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈవెంట్ మేనేజర్లతో పోలీసులు సమావేశం నిర్వహించి గైడ్ లైన్స్ వివరించారు.
నిబంధనలకు అతిక్రమించే ఈవెంట్ మేనేజర్లు, యువతపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రతి కదలికను వీడియోలో బంధించాలని నిర్వాహకులకు పోలీసులు సూచనలు జారీ చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకూ ఈవెంట్స్ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే తెల్లవారుజామున 3 గంటలవరకూ అనుమతించాలని నిర్వాహకులు కోరుతున్నారు. అతిగా మద్యం సేవించేవాళ్లు తప్పకుండా డ్రైవర్లను వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి ఫ్లైఓవర్లను మూసేసేలా పోలీసులు ఆలోచిస్తున్నారు. అంతేకాక.. ఫ్లైఓవర్ల సమీపంలో నిఘా కూడా మరింత పెంచాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈవెంట్ నిర్వాహకులు మాత్రం పోలీసుల కఠిన నిబంధనలు జోష్ ను కంట్రోల్ చేశేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.