మన పరిస్థితి ఎలా తయారైందంటే అన్నపానాలు లేకుండానైనా ఉండిపోగలరు కానీ టీవీ లేకుండా ఒక్క క్షణం ఉండలేని దుస్థితి. దీన్ని ఆసరాగా తీసుకుని ఒక వ్యసనంగా మార్చేసి భారీ వ్యాపారాలకు తెర తీసిన వైనం కనిపిస్తోంది. కార్పరేట్ శక్తులు ప్రవేశించి బుల్లి తెరను అతలాకుతలం చేస్తూ తమ ఆర్ధిక సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న వాతావరణంలో సగటు జీవికి ఇంట్లో వినోదం దూరం కానుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
చానళ్ల ప్రసారాలు ఆగవుట :
అయితే ఈ నెల 29 నుంచి అమలులోకి రానున్న కొత్త కేబుల్ నిబంధనల వల్ల టీవీ చానళ్ల ప్రసారాలకు అంతరాయం ఉండదని టెలికాం నియంత్రణ సంస్థ (టాయ్) స్పష్టం చేసింది. ఈ నెల 29 తర్వాత సబ్స్రైబ్డ్ చానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ట్రాయ్ ఈ మీఅరకు వివరణ ఇచ్చింది. వినియోగదారులు ఇవాళ చూస్తున్న ఏ చానల్ కూడా ఈ నెల 29న ఆగిపోదని, ఈ మేరకు ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రతి వినియోగదారుడికి ఇష్టమైన చానళ్లను ఎంపిక చేసుకోవడానికి తగు సమయం ఉంటుందని తెలిపింది. కాగా, ట్రాయ్ ప్రతిపాదించిన ధరలు తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల టీవీ వీక్షకుల సంఘం ప్రతినిధులు తెలిపారు. వీక్షకులు ఉచిత చానళ్లను మాత్రమే చూడాలని, పెయిడ్ చానళ్లకు డబ్బులు కట్టవద్దని కోరారు.
తరువాత అయినా తంటాయేనా :
ఓ వైపు ట్రాయ్ చెబుతోంది గడువు పెంపు మాత్రమే. అంటే అసలు తంటా ఇంకా అలాగే ఉందన్నమాట. ఇష్టం వచ్చినట్లుగా చానళ్ళ యజమానులు రేట్లు పెంచుకోవడం ద్వారా టీవీక్షకుని నెత్తిన వందల రూపాయల పెను భారం పడనుంది. అది ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. మరి. దాన్ని ఎదుర్కొనేందుకు కొంతకాలం పాటు టీవీలను మూసుకుని కూర్చోవడానికి వినియోగదారుడు సిధ్ధంగా ఉన్నాడా అంటే సమాధానం లేదు అనే వస్తోంది. మరి ఈ వ్యసనమే ఆలంబనగా సాగుతున్న ఈ నయా దోపిడీ విక్రుత రూపం ఏంటన్నది కొన్ని రోజులూ తరువాత తెలుస్తుంది.