వైసీపీ అధినేత మీద తరచూ టీడీపీ చేసే ఒక బలమైన ఆరోపణ ఉంది. దానికి సరైన సమాధానం చెప్పుకోలేక వైసీపీ నాయకులు ఎపుడూ తడబాట్లు పడుతూ ఉంటారు. మరి కొద్ది రోజుల్లో ఆ ఆరోపణను పూర్తిగా తొలగించుకునేందుకు జగన్ రెడీ అయిపోతున్నారు. అన్ని అస్త్ర శస్త్రాలతో జగన్ ఎన్నికల యుధ్ధానికి సిధ్ధమవుతున్నారు.
చలో అమరావతి :
వైసీపీ అధినేత కొత్త ఏడాది అమరావతిలో కాపురానికి వస్తున్నారు. ఇంతకాలం హైదరాబాదు లోటస్ పాండ్ కేంద్రంగా జగన్ పార్టీ రాజకీయాలు నడిపారు, దాని మీద టీడీపీ నాయకులు ఓ రేంజిలో విరుచుకుపడేవారు, పక్క రాష్ట్రంలో ఉండి రాజకీయం చేస్తున్నారని, ఏపీలో ఉండరని లోకేష్ నుచి మొత్తం బడా నాయకులంతా జగన్ మీద విమర్శలు చేసిన వారే. దాన్ని ఇపుడు తొలగించుకునే భగంగా జగన్ షిఫ్ట్ అవుతున్నారు.
జనవరి రెండో వారంలోనే రాజధాని అమరావతి పరిధిలో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నట్లు వైసీపీ వర్గాల సమాచారం. రాజధాని పరిధిలోని కృష్ణా నది ఒడ్డున తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇది కేవలం పార్టీ కార్యాలయమే కాదు జగన్ నివాసంగా కూడా ఉండనుంది.
మరింత ధీటుగా :
ఇన్నాళ్ళూ పార్టీ నేతలు హైదరాబాద్ వెళ్లి జగన్ని కలవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు జగన్ తన మకాంను పూర్తిగా అమరావతికి మారుస్తుండటం వైసీపీ శ్రేణులకు నేతలకూ ఊరటనిచ్చే విషయమే. ఇకపై వాళ్లు తమ అధినేతను కలిసేందుకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండబోదు.
జగన్ కూడా రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై పూర్తిగా దృష్టిసారించేందుకు అమరావతిలో ఆయన నివాసం దోహదపడనుంది. అంతే కాదు, జగన్ సైతం పూర్తిగా ఏపీపై శ్రద్ధ పెట్టేందుకు ఎప్పటికపుడు వ్యూహాలకు పదును పెట్టేందుకు కూడా ఈ కొత్త కాపురం బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.