ప్రముఖ జాతీయ ఛానల్ నిర్వహించిన సర్వే లో జగన్ పార్టీ కి 19 పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెబుతుంది. నిజానికి 19 స్థానాలంటే కేంద్రం లో కీ రోల్ ప్లే చెయ్యొచ్చు. అయితే అత్యధిక స్థానాలు కైవసం చేసుకొనే ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అని సర్వే చెప్పింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమికి మద్దతు పలికినా... చాంతాడంత డిమాండ్లను ముందు పెట్టే అవకాశాలే ఎక్కువ.
అంతేకాక అవకాశం ఉంటే... ఏకంగా పీఎం పదవినే డిమాండ్ చేసేందుకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఏమాత్రం సంకోచించరు. ఇక 20 సీట్లతో రెండో స్థానంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ములాయం ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని ఎప్పటినుంచో కలలు కంటున్నారాయే. ఇక ఆ తర్వాత ఉన్న పార్టీ... ఏపీలో బలమైన విపక్షంగా ఉన్న వైసీపీనే.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పేపర్పై రాసిచ్చే ఏ కూటమికి అయినా భేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా... ఎలాంటి పెద్ద డిమాండ్ల జాబితా లేకుండా భేషరతు మద్దతు పొందగలిగేది ఒక్క వైసీపీ నుంచే. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలిగే అవకాశాలున్న పార్టీ ఒక్క వైసీపీనే. అంటే... ఇప్పటికే జాతీయ రాజకీయాలపై సంచలన ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు కేసీఆర్ల కంటే జగన్కే చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువన్న విశ్లేషణలు సాగుతున్నాయి.