జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్ర
విచిత్రమైన లాజిక్కులు మాట్లాడుతున్నారు. విజయవాడలో జరిగిన జిల్లాల పార్టీ నేతల సమావేశంలో
మాట్లాడుతూ గాలి జనసేన వైపే వీస్తోందట. మరి ఏ గాలి వీస్తోందో ? పవన్ ఏ గాలి
గురించి మట్లాడారో అక్కడున్న వారికెవరికీ అర్ధం కాలేదు. తర్వాత పవన్ చెప్పిన
లాజిక్కుతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ పవన్ చెప్పిన లాజిక్కు ఏమిటంటే, జనసేన ఎన్నికల
గుర్తు టీ గ్లాసు. తాము కోరుకున్న గుర్తునే ఎన్నికల కమీషన్ కేటాయించింది కాబట్టి
గాలి తమవైపే వీస్తోంది అనటానికి అదే గుర్తట. లాజిక్కులో ఏమన్నా అర్ధముందా ?
ఎన్నికల కమీషన్ ను ఎన్నికల గుర్తులు అడిగినపుడు అందుబాటులో ఉంటే కేటాయించేస్తుంది. పవన్ కల్యాణ్ ఏ గుర్తు అడిగితే ఎన్నికల కమీషన్ కు ఏముంది ? పవన్ అడిగిన గుర్తు కేటాయించటానికి వీలుందా లేదా అని మాత్రమే చూస్తుంది. అందుబాటులో ఉంటే వెంటనే కేటాయించేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. తమ పార్టీ ఎన్నికల చిహ్నంగా టీ గ్లాసును పవన్ కోరుకున్నారు. అవకాశం ఉంది కాబట్టి వెంటనే కేటాయించేశారు. అంతేకానీ అడిగిన గుర్తును ఎన్నికల కమీషన్ కేటాయించటానికి రేపటి ఎన్నికల్లో పార్టీ గెలవటానికి ఏమిటి సంబంధమో ఎవరికీ అర్ధం కావటంలేదు.
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి కూడా పవన్ ఏకబిగిన 13 జిల్లాల్లో టూర్ చేసింది లేదు. పైగా ఏ జిల్లాలో పర్యటన పెట్టుకున్నా కనీసం ఆ జిల్లాలో కూడా టూరు పూర్తి చేయటం లేదు. రెండు రోజులు పర్యటిస్తే నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇఫ్పటి వరకూ పట్టుమని పదిమంది అభ్యర్ధులను కూడా ప్రకటించలేదు. అంటే ప్రకటించటానికి అక్కడ నేతలు కూడా ఎవరూ లేరనుకోండి అది వేరే సంగతి. అసలు పోటీ చేయటానికి అభ్యర్ధులే లేని జనసేన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతోందని పవన్ చెప్పటమంటే విచిత్రంగానే ఉంది.
పవన్ మాటలు విన్న తర్వాత అందరిలోను ఓ పోలిక కనిపిస్తోంది. అదేనండి ప్రజాశాంతి పార్టీ వ్యవస్ధాపకుడు కెఏ పాల్. పాల్ కూడా రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది ప్రజాశాంతి పార్టీనే అన్నారు. చంద్రబాబునాయుడునే తనకు సలహాదారుగా పెట్టుకుంటారట. ఎక్కడ చూసినా తమ పార్టీ గురించే జనాలు చర్చించుకుంటున్నారు కాబట్టి అధికారంలోకి రావటంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని పాల్ చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. పాల్ మాటలు ఇంకా మరచిపోకముందే తాజాగా అవే మాటలను పవన్ కూడా చెప్పటం గమనార్హం.