వెండితెరపై విలక్షణ నటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న నటుడు ప్రకాశ్ రాజ్. ఆయన నటిస్తుంటే..ఆ పాత్రకు జీవం పోసినట్లు ఉంటుంది. ఒకప్పుడు విలన్ గా కెరీర్ ప్రారంభించినా..ఇప్పుడు అన్ని రకాల పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కొంత కాలంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు ప్రకాశ్ రాజ్. ఇటీవల తాను ఎంపిగా పోటీ చేస్తానని వార్తలు కూడా వచ్చాయి. ఎప్పుడూ ఓటేసి వెళ్ళిపోవడమేనా, ఇకపై మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిథి లేదా రాజకీయ పార్టీ మన కోసం ఏం చేస్తుందో ఆలోచిద్దాం. అవసరమైతే చట్ట సభలకు వెళ్ళేందుకూ ప్రయత్నిద్దాం.. ఇదే ప్రకాష్ రాజ్ ఫర్ ఏ ఛేంజ్అంటున్నాడు.
తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని క్లారిటీ ఇచ్చేసిన ప్రకాష్ రాజ్, కర్నాటకలో తనకు కాంగ్రెస్, జేడీఎస్ నుంచి మద్దతు లభించినా, లభించకపోయినా.. సొంతంగానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమంటూ పునరుద్ఘాటించిన ప్రకాష్ రాజ్, ఏపీ రాజకీయాలపై స్పందించేందుకు విముఖత చూపించారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల కోసం బెంగళూరు నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న ప్రకాష్రాజ్, అప్పుడే రాజకీయ కార్యాచరణను సిద్ధం చేసేసుకున్నాడు.
బెంగళూరులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ 'జస్ట్ ఆస్కింగ్' అంటూ కేంద్రంలోని మోడీ సర్కార్పై సోషల్ మీడియా వేదికగా యుద్ధం ప్రకటించిన విషయం విదితమే. తన స్నేహితురాలైన గౌరీ లంకేష్ హత్య తర్వాతే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కలిగిందనీ, కేంద్రాన్ని ప్రశ్నించాలన్న కసి పెరిగిందనీ చెబుతున్నారు ప్రకాష్ రాజ్. బెంగళూరులోని మార్థాస్ ఆస్పత్రిలో జన్మించానని, చామరాజపేట, శాంతినగరలలో కొన్నాళ్లు నివాసం ఉన్నానని చెప్పారు.
ఇక బీజేపీకి కంచుకోటగా నిలుస్తున్న బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీకి దిగాలని ప్రకాశ్ రాజ్ నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. గత పదేళ్లుగా ఇక్కడ పీసీ మోహన్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఆయన భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. త్వరలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తానన్నారు.