తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ మేడా
మల్లికార్జున రెడ్డి వైసిపిలో చేరారు. నాలుగున్నర సంవత్సరాలుగా 22 మంది వైసిపి
ఎంఎల్ఏలతో పాటు ముగ్గరు ఎంపిలను చంద్రబాబునాయుడు టిడిపిలోకి లాక్కున్న విషయం
అందరికీ తెలిసిందే. కానీ టిడిపికి చెందిన ఓ ఎంఎల్ఏ ప్రతిపక్షమైన వైసిపిలో చేరటం
ఇదే మొదటిసారి. అందులోను షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో కడప
జిల్లాలోని రాజంపేట టిడిపి ఎంఎల్ఏ మేడా మల్లికార్జున రెడ్డి వైసిపిలో చేరటమంటే
ఆశ్చర్యమే. ఇప్పటి వరకూ కడప జిల్లాలో టిడిపికున్న ఏకైక ఎంఎల్ఏ కూడా వైసిపిలో
చేరటంతో అధికారపార్టీకి ఎంఎల్ఏల ప్రాతినిధ్యం లేని ఏకైక జిల్లాగా కడప రికార్డు
సృష్టించిందనే చెప్పాలి.
మేడా పార్టీ మారుతారనే వార్త కొత్తదేమీ కాదు. పార్టీ మార్పిడి గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతునే ఉంది. పార్టీలో మేడాకు ఇమడలేని పరిస్ధితులను ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి అండ్ కో సృష్టించటంతోనే మేడా పార్టీ మారాల్సిన పరిస్ధితులు తలెత్తాయి. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్సీ బత్యాల చెంగల్రాయలుకు టిక్కెట్టింపుచుకునే ఉద్దేశ్యంతోనే ఆది పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే మేడాకు ఫిరాంయిపు మంత్రి అడ్డంకులు సృష్టిస్తున్నారు. చివరకు రాజంపేట జరుగుతున్న పార్టీ సమావేశాలకు కూడా ఎంఎల్ఏని పిలవటం మానేశారు. మొన్ననే జరిగిన సమావేశానికి ఎంఎల్ఏని పిలవకపోవటంతో ఫిరాయింపు మంత్రి అనుచరులకు, ఎంఎల్ఏ మద్దతుదారులకు మధ్య గొడవే అయ్యింది.
చివరకు ఆ పంచాయితీ మంగళవారం చంద్రబాబునాయుడు దగ్గరకు చేరింది. నియోజకవర్గంలోని పార్టీ నేతలందరూ పంచాయితీకి హాజరైనా మేడా మాత్రం హాజరుకాలేదు. దాంతో మేడా పార్టీ మారటంపై పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాతే చంద్రబాబు సమావేశానికి హాజరుకాలేదని అందరికీ అర్ధమైపోయింది. మరి పార్టీలో చేరిన మేడాకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి హామీలిచ్చింది తెలియటం లేదు. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టు హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శిల్పా చక్రపాణిరెడ్డి ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసినట్లే మేడా కూడా ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తారేమో చూడాలి