చంద్రబాబునాయుడు ఓట్ల రాజకీయం రాబోయే
ఎన్నికల్లో పారేట్టు కనబడటం లేదు. అగ్రవర్ణ
పేదలకు కేంద్రం పది శాతం రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే కదా ? ఆ
రిజర్వేషన్లలోనే వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలని చంద్రబాబు పెద్ద ప్లానే వేశారు. అగ్రవర్ణ
పేదలకు కేంద్రం ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇవ్వాలని
నిర్ణయించారు చంద్రబాబు. అంటే మొత్తం పదిశాతం రిజర్వేషన్లలో కాపులకే చంద్రబాబు 5
శాతం రిజర్వేషన్లు కేటాయించనున్న విషయం స్పష్టమవుతోంది. సరే చంద్రబాబు నిర్ణయం
న్యాయసమీక్షకు నిలుస్తుందా లేదా అన్నది వేరే విషయం.
నిజానికి కాపులకు రిజర్వేషన్లు వర్తింపచేయటంలో చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తానని చంద్రబాబే హామీ ఇచ్చారు. అధికారం అందుకోవటమే ఏకైక లక్ష్యంతో ఆచరణ సాధ్యంకానీ హామీ ఇచ్చారు చంద్రబాబు. సరే తర్వాత మొదలైన ఆందోళనలు, చంద్రబాబు వేసిన డ్రామాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రేపటి ఎన్నికల్లో కాపుల ఓట్ల కోసం ఎటువంటి మాయలు చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలోనే కేంద్రం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు కన్నుపడింది.
కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకునే టైపు చంద్రబాబు. అందుకనే 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు సగభాగమనేశారు. ఇంకేముంది రేపటి ఎన్నికల్లో కాపుల ఓట్లన్నీ తనకే అని చంద్రబాబు లెక్కలేసేసుకుంటున్నారు. సరిగ్గా ఆ పాయింట్ మీదే కాపులు చంద్రబాబుకు ఎదురు తిరిగారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన పదిశాతం రిజర్వేషన్లలో తమకు 5 శాతం వాటా వద్దంటూ కాపునాడు సంఘం నేతలు. కాపుల వ్యతిరేకైన చంద్రబాబు చెప్పే మాయ మాటలను ఎవరూ నమ్మవద్దంటూ కాపు సంఘం నేతలు విజ్ఞప్తులు చేశారు. చంద్రబాబు తాజా నిర్ణయంతో కాపులకు ఇతర అగ్రవర్ణాలకు మధ్య చిచ్చురేగటం ఖాయమంటున్నారు నేతలు.
కాపులకు వ్యతిరేకంగా ఇతర అగ్రవర్ణాలను ఎగదోయటం కోసమే చంద్రబాబు నాటకాలాడుతున్నట్లు నేతలు మండిపోయారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్షలో నిలబడదని కూడా సంఘం నేతలు స్పష్టంగా చెబుతున్నారు. అగ్రవర్ణాలకు ఇచ్చిన రిజర్వేషన్లలో సగం తమకు అవసరం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీనికన్నా 2014లో కాపులను బిసిల్లో చేరుస్తానన్న హామీనే చంద్రబాబు నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేయటం గమనార్హం.
చంద్రబాబు తాజా నిర్ణయంతో ఎన్నికల ముందు మరోసారి కాపులను మోసం చేయటానికే ప్లాన్ వేస్తున్నట్లు మండిపడ్డారు. చంద్రబాబు మోసపు హామీలను, నిర్ణయాలను కాపులందరూ గ్రహించాలని చెప్పారు. తమఓట్ల కోసం పోయిన ఎన్నికల్లో చంద్రబాబు చేసిన మోసంతోనే మండుతున్న కాపులు తాజా నిర్ణయంతో మరింత రగిలిపోతున్నారు. చంద్రబాబు చేసిన మోసాన్ని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయనున్నట్లు కాపునాడు సంఘం ప్రకటించటం నిజంగా చంద్రబాబుకు షాకే. చూడబోతే పోయిన ఎన్నికల్లో తిన్న దెబ్బతో కాపులకు జ్ఞానోదయం అయినట్లే ఉంది.