విశాఖపట్నం విమానాశ్రయంలో అక్టోబర్ 25వ
తేదీన జరిగిన హత్యాయత్నం ఘటనను చాలా చిన్న విషయంగా చూపేందుకు చంద్రబాబునాయుడు
మీడియా చాలా అవస్తలు పడుతోంది. హత్యాయత్నం ఘటనపై సిట్ విచారణకు, ఎన్ఐఏ విచారణలో
తేలిన అంశాలకు పెద్ద తేడా ఏమీ లేదని తేల్చేసింది. అంటే ఎన్ఐఏ విచారణ జరిపినా
పెద్దగా ఉపయోగం కనబడలేదని చెప్పటమే సదరు మీడియా ఉద్దేశ్యం. అందుకనే సిట్ రిమాండ్ రిపోర్టులోని
అంశాలు ఎన్ఐఏ చార్జిషీటులోని అంశాలు దాదాపు ఒకటే అనే విధంగా ఓ టేబుల్ కూడా
ఇచ్చింది.
అయితే ఇక్కడే సదరు మీడియా తప్పులో కాలేసింది. ఎన్ని విచారణ సంస్ధలు దర్యాప్తు చేసినా ఘటన ఒకటిగానే ఉంటుంది. నిందితుడు ఎప్పుడు ప్లాన్ చేసాడు అన్న విషయంలో కూడా పెద్దగా మార్పు ఉండదు. జగన్ దగ్గరకు ఏమని చెప్పి నిందితుడు శ్రీనివాస్ వచ్చాడనే విషయం కూడా ఒకటిగానే ఉంటుంది. అయితే రెండు టేబుళ్ళల్లోని ఏడు అంశాల్లో 5వ అంశం విషయంలోనే సదరు మీడియా తప్పులో కాలేసింది. ఇంతకీ 5వ అంశంలో ఏముంది ? ఏముందంటే, రిమాండ్ రిపోర్టులో జగన్ పై దాడి వెనుక ఎవరి కుట్ర ఉందో దర్యాప్తులో వెల్లడి కాలేదని ఉంది. అదే సమయంలో చార్జిషీటులో కుట్రతో పాటు దాడికి ప్రేరేపించిన అంశాలపై విచారణ జరుగుతోందని ఎన్ఐఏ పేర్కొంది.
ఇక్కడే అందరికీ అనేక అనుమానాలున్నాయి. దాడి చేసింది శ్రీనివాసరావే అన్న విషయం అందరికీ తెలుసు. కానీ శ్రీనివాసరావుతో చెప్పి జగన్ పై దాడి చేయించిందెవరన్న విషయమే బయటకు రావాలి. ఈ విషయంలో దాడికి సూత్రదారులు చంద్రబాబే అంటూ జగన్ అండ్ కో ఆరోపణలు చేస్తోంది. హత్యాయత్నానికి కుట్ర చేసిందెవరు అన్న కీలక విషయాన్ని చంద్రబాబు మీడియా వదిలేసి రెండు సంస్ధల విచారణలో తేలిందిందే అంటూ జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది.
సిట్ విచారణ జరిపినపుడు ఎయిర్ పోర్టులో క్యాంటిన్ యజమాని, టిడిపి నేత హర్షవర్ధన్ చౌదరిని కనీసమాత్రంగా కూడా విచారించలేదు. చౌదరిని విచారణకు హాజరుకావాలంటూ ఎన్ఐఏ నోటీసులిచ్చింది. చౌదరి అనారోగ్యంతో ఉన్న కారణంగా ఒకసారి ఇంటికే వెళ్ళి విచారించింది. విచారణ నిమ్మితం చౌదరిని అదుపులోకి తీసుకుంటే కుట్ర కోణంలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చౌదరి పాత్రపై జగన్ అండ్ కో ఎన్ని ఆరోపణలు చేసినా సిట్ కనీసం పట్టించుకోలేదు. అందుకే థర్డ్ పార్టీ విచారణ కావాలంటూ జగన్ హై కోర్టును అడిగింది. ఇంత కీలకమైన అంశాన్ని కావాలనే చంద్రబాబు మీడియా తొక్కిపెట్టింది.
హై కోర్టు కూడా జగన్ వాదనతో ఏకీభవించి ఎన్ఐఏ విచారణకు ఆదేశించగానే చంద్రబాబు అండ్ కో ఎంత గగ్గోలు పెడుతున్నది అందరూ చూస్తున్నదే. ఎన్ఐఏ విచారణను అడ్డుకునేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నది అందూర చూస్తున్నారు. నిజంగానే జగన్ పై జరిగిని హత్యాయత్నంతో ఏమీ సంబంధం లేకపోతే ఎన్ఐఏ విచారణ అంటే చంద్రబాబు అండ్ కో ఎందుకంత భయపడుతున్నారు ? విచారణలో భాగంగా టిడిపి నేతల్లో కొందరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవటం లేకపోతే అరెస్టులు చేస్తుందనే ప్రచారంలో భాగంగానే చంద్రబాబు మీడియా కూడా కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోందని అర్ధమవుతోంది.