తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ముందునుండి మిత్రపక్ష పార్టీ ఎంఐఎం పార్టీ అని బహిరంగంగానే ఇరు పార్టీలకు చెందిన నేతలు నాయకులు కామెంట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఓటుకు నోటు సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతున్న సమయంలో ఎంఐఎం పార్టీ కాపాడిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగానే మీడియా ముందు వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర బడ్జెట్లో కిసాన్ సమ్మాన్ నిధిని ప్రకటించారు. దానికి ప్రతిస్పందించిన ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసి తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. వ్యవసాయ సమస్యలపై కేసిఆర్కు ఉన్న లోతైన అవగాహన మరే నేతకు లేవన్నది ఆయన ట్వీట్లో స్పష్టంగా అర్దమవుతుంది.
తెలంగాణ చేపట్టిన పథకాలనే ప్రధాని అమలు చేస్తున్నారని, ప్రధాని మోదికి సొంత ఐడియాలు లేవని ఆయన అన్నారు. దేశాన్ని ముందుకు నడిపించేందుకు కేసిఆర్ లాంటి నేతలు అవసరమన్నారు.
దేశానికి దిశా నిర్ధేశం చేసే సత్తా ఒక్క కేసిఆర్కే ఉందని, ఆయన చురుకుదనం, ముందుచూపు, అమోఘమైన జ్ఞానం దేశంలోని రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని అసద్ అన్నారు. ఇటువంటి నేతలు జాతీయ రాజకీయాల్లో ఉంటే కచ్చితంగా దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.