2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటం తో చంద్ర బాబు ఎవరికీ టికెట్స్ ఇవ్వాలో , ఎవరికీ ఇవ్వకూడదో ఇప్పటీకే ఒక అంచనా కు వచ్చినట్లు తెలుస్తుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారని.. ప్రజల నుంచి తీవ్ర ఎదుర్కొంటున్న దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆయన ఈ దఫా టికెట్ ఇవ్వబోరని తెలుస్తోంది. ఇలా వచ్చే ఎన్నికల్లో బాబు మొండిచేయి చూపనున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 15 మంది రాయలసీమ వారేనని సమాచారం. టికెట్ దక్కని నేతలు వీరేనంటూ కూడా సోషల్ మీడియాలో, వార్తాసంస్థల్లో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.
సీమలో జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో పుట్టపర్తి, కదిరి, గుంతకల్, కల్యాణదుర్గం, శింగనమల టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిపోవడం ఖాయమని తెలుస్తోంది. పుట్టపర్తి నుంచి ప్రస్తుతం మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు ఈ దఫా టికెట్ వచ్చే అవకాశాలే లేవట. శింగనమలలో యామినీ బాలకు కూడా మొండిచేయి ఖాయమట. కాంగ్రెస్ నుంచి శైలజానాథ్ ను పార్టీలోకి రప్పించి ఆయన్ను శింగనమలలో పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గుంతకల్ శాసనసభ్యుడు జితేంద్ర గౌడ్, కల్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిలకు కూడా ఈసారి టీడీపీ జాబితాలో చోటు దక్కబోదట. చిత్తూరులో ఫిరాయింపు మంత్రి అమర్ నాథ్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు కూడా టికెట్ దక్కదని జోరుగా ప్రచారం జరుగుతోంది. చిత్తూరు, తంబళ్లపల్లె, సత్యేవేడు నియోజకవర్గాల సిట్టింగ్ లకు కూడా నిరాశే ఎదురుకానుందని సమాచారం. కర్నూలులో భూమా కుటుంబానికి భారీ షాక్ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, నంద్యాలలో ఆమె సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డిలకు టికెట్ దక్కడం కష్టమేనట.