తెలుగుదేశంపార్టీలో సీట్ల పంచాయితీ ఎంతకీ తెగటం లేదు. దాదాపు డజను
సీట్లలో నేతల మధ్య పెద్ద ఎత్తున పంచాయితీలు నడుస్తున్నాయి. ఎన్నోసార్లు
చంద్రబాబునాయుడు దగ్గరే పంచాయితీల జరిగాయి. అయినా ఏ ఒక్క విషయంలోను పంచాయితీ
పూర్తికాలేదు. పంచాయితీ జరుగుతున్న సీట్లలో ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లోనే ఉండటం
విచిత్రంగా ఉంది. చివరకు చిత్తూరు జిల్లాలో కూడా ఒకటి రెండు సీట్లలో పంచాయితి
చేయలేకపోతున్నారు చంద్రబాబు.
సిఎం సొంత జిల్లాలోని పుంగనూరు నుండి మంత్రి అమరనాధరెడ్డి పోటీ చేయటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. అదే విషయాన్ని చంద్రబాబుతో చెబితే ఆయన వినటం లేదు. కచ్చితంగా పుంగనూరు నుండే పోటీ చేయాలని చెప్పినా మంత్రి వినటం లేదు. ఇక కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి మధ్య దాదాపు మూడేళ్ళుగా పంచాయితీ నలుగుతునే ఉంది. ఈ సీటు విషయం తేలితేగానీ కడప ఎంపి సీటుపై క్లారిటీ రాదు.
ఇక కర్నూలు జిల్లాలో తాజాగా డోన్, అంతకుముందు నుండే కర్నూలు సీటుపై ఎస్వీ మోహన్ రెడ్డి, టిజి భరత్ మధ్య వివాదం మామూలుగా లేదు. నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజవర్గాల గురించి కొత్తగా చెప్పే పనేలేదు. ఆళ్ళగడ్డలో ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియకు, నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డికి సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి బాగా పొగ పెడుతున్నారు. ఏవికి భూమా వ్యతిరేకులందరూ మద్దతిస్తున్నట్లు సమాచారం. భూమా, ఏవి మధ్య చంద్రబాబు ఎన్నిసార్లు పంచాయితీలు చేసినా ఏమాత్రం ఉపయోగం కనబడలేదు.
ఇక అనంతపురం జిల్లా గురించి చెప్పేదే లేదు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14 సీట్లలో టిడిపికి నాలుగు సీట్లొస్తే చాలా ఎక్కువంటూ స్వయంగా టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పారు. దాదాపు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో జేసి పెడుతున్న కుంపట్లు అంతా ఇంతా కాదు. వాళ్ళ పని వాళ్ళను చేసుకోనీకుండా ప్రతీ ఎంఎల్ఏని కెలుకుతునే ఉన్నారు. ఎంఎల్ఏల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు స్వయంగా చెప్పినా జేసి వినటం లేదు. అనంతపురం ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరికి జేసికి ఎన్నిసార్లు రోడ్లపై గొడవలయ్యాయో లేక్కేలేదు.
స్ధూలంగా రాయలసీమ వరకు టిడిపి పరిస్ధితి ఇది. పై నియోజకవర్గాల్లో పంచాయితీల పరిష్కారానికి స్వయంగా చంద్రబాబే ఎన్నోసార్లు కూర్చుని సర్దుబాటు చేద్దామని ప్రయత్నించారు. సమావేశంలో చంద్రబాబు చెప్పినదానికి ఓకే అంటారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి గోల వాళ్ళదే. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్ధుల దాకా అవసరమే లేదు. ఎవరికి టిక్కెట్టిచ్చిన టిడిపి నేతలే ఓడగొట్టేట్లున్నారు చూస్తుంటే. అంటే పార్టీ నేతలో, మాజీ ఎంఎల్ఏలే రాయలసీమలో టిడిపి పుట్టి ముంచేట్లున్నారు.