తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి మరొకరు మంత్రి పదవి చేపట్టారు. రెండు నెలలు గడిచిపోయాయి. ఇంతవరకూ వాళ్లిద్దరూ ప్రభుత్వాధినేతలు. ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ఉప ముఖ్యమంత్రి.! మంత్రుల్లేరు.. ఆశావహులంతా తమకు ఎప్పుడు అమాత్య భాగ్యం కలుగుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతకూ వారికి ఆ ఛాన్స్ ఎప్పుడు దక్కబోతోంది?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువ. నిర్ణయాలన్నీ ముహూర్తాలు, అమృత ఘడియలపైనే నడుస్తుంటాయి. ఇప్పుడు మంత్రి వర్గం కూడా ముహూర్త బలం కోసమే ఆలస్యం అవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీ వసంత పంచమి కాబట్టి ఆరోజు మంత్రివర్గ విస్తరణ ఖాయమని చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఆరోజు కూడా ఆ శుభవార్త వినలేకపోయారు. దీంతో తదుపరి విస్తరణ ఎప్పుడోనని మళ్లీ దీర్ఘాలోచనలో పడిపోయారు. అయితే ఈ నెల 24వ తేదీన మరో మంచి ముహూర్తం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి ఆరోజైనా కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారా.. లేక ఇంకొన్నాళ్లు పోస్ట్ పోన్ చేస్తారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి.
తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచిపోయింది. అయినా కూడా మంత్రి వర్గాన్ని విస్తరించకపోవడం వెనుక కారణాలేమై ఉంటాయనే సందేహాలు చాలా మందికి వ్యక్తమవుతున్నాయి. అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు దూరంగా ఉంటున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు మరో 2 నెలల్లో ఉన్న సమయంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే అసంతృప్తులు సహకరించరేమోననే బెంగ కేసీఆర్ లో ఉన్నట్టు కొంతమంది చెప్తున్న మాట. దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర కూటమి బలపడుతున్న నేపథ్యంలో ఈ అసంతృప్తులు చేటు చేస్తాయేమోననే భయం ఆయనకు ఉండొచ్చనేది విశ్లేషకుల అంచనా.
ఒక వేళ అదే నిజమైతే మంత్రివర్గ విస్తరణకోసం మరో రెండు నెలలు వెయిట్ చేయక తప్పదు. అయితే అన్ని రోజులపాటు వెయిట్ చేయకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే అరకొర మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఉంటే అసంతృప్తుల బెంగ ఉంటుంది కానీ, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడు ఒకరిద్దరు అసంతృప్తులకు కేసీఆర్ భయపడే పరిస్థితి ఉండదని ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట. కాబట్టి ఎన్నికలకు, మంత్రివర్గ విస్తరణకు సంబంధంలేదనేది వారి మాట. ఇదే నిజమైతే ఈలోపే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.