చంద్రబాబునాయుడుకు బ్యాడ్
టైం స్టార్ట్ అయినట్లే ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశంపార్టీలో
నుండి వైసిపిలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటి వరకూ నలుగురు ఎంఎల్ఏలు, ఇద్దరు
ఎంపిలు టిడిపికి రాజీనామా చేస్తే ఒక్కళ్ళు తప్ప మిగిలిన అందరూ వైసిపిలోనే చేరారు.
దాన్ని బట్టే వైసిపికి ఎంత ఊపు పెరుగుతోందో అర్ధమైపోతోంది. ఒకవైపు రాజీనామా చేసిన
ప్రజా ప్రతినిధులు వైసిపిలో చేరుతుంటే మరోవైపు అంతకుమించి చంద్రబాబులో
ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది.
వలసల పరంపరలో తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసిపి కండువ కప్పుకున్నారు. మోదుగుల మంగళవారం టిడిపికి రాజీనామా చేయటంతో జిల్లా పార్టీలో కలకలం రేగింది. మోదుగుల రాజీనామా చాలా కాలం క్రితం నుండి ఊహిస్తున్నదే. నిజానికి రావెల కిషోర్ బాబు టిడిపికి రాజీనామా చేసినపుడే మోదుగుల కూడా పార్టీ నుండి బయటకు వచ్చేస్తారని అనుకున్నారు. కానీ రాజీనామా చేయటానికి ఇంత కాలం పట్టింది.
ఇక్కడే చంద్రబాబుకు జగన్ కు మధ్య మౌళికమైన తేడా కనిపిస్తోంది. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 22 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నారు. వారిలో నలుగురికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టారు. అదే జగన్ విషయానికి వస్తే టిడిపిలో నుండి వైసిపిలోకి వస్తున్న వారిని ఎంఎల్ఏ, ఎంపి పదవులకు రాజీనామాలు చేయించిన తర్వాతే చేర్చుకుంటున్నారు.
సరే ప్రస్తుత విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో మోదుగుల వైసిపి తరపున పోటీ చేయటం ఖాయమనే అనుకోవాలి. అయితే నియోజకవర్గమే తేలలేదు. మోదుగుల దృష్టంతా నరసరావుపేట లోక్ సభ సీటు మీదే ఉంది. అయితే వైసిపిలో అక్కడ అభ్యర్ధిగా లావు శ్రీ కృష్ణదేవరాయులున్నారు. కాబట్టి అవకాశాలు తక్కువనే చెప్పాలి. అందుకే సత్తెనపల్లి అసెంబ్లీకి కూడా పోటీకి మోదుగుల రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.