ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబునాయుడుకున్న కపుడుమంట అర్ధమైపోతోంది.
లోటస్ పాండ్ లో జగన్ తో సినీహీరో నాగార్జున భేటీ అవటాన్ని చంద్రబాబు అస్సలు తట్టుకోలేకపోతున్నారు.
ఈరోజు ఉదయం పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ ‘సినీ హీరోలు ఓ నేరగాడిని కలుస్తున్నారంటూ’ తన అక్కసును తీర్చుకున్నారు. ‘ఓ నేరగాడికి సినీహీరోలు సరెండర్ అయ్యారు’ అంటూ మండిపడ్డారు.
చంద్రబాబు మాటలు వింటుంటేనే జగన్ అంటే ఎంతగా ఉలికిపడుతున్నారో అర్ధమైపోతోంది. రేపటి ఎన్నికల్లో టిడిపికి ఓటమి ఖాయమని చంద్రబాబుకు అర్ధమైపోయిందనే సంకేతాలే కనబడుతున్నాయి. అందుకనే జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మొదటి నుండి సినీరంగంలో మెజారిటీ టిడిపి వైపే ఉన్నారన్నది వాస్తవం. అయితే, ఈమధ్యనే పలువురు సెలబ్రిటీలు వైసిపిలో చేరారు. అదే సమయంలో టిడిపిలో ఉన్న సినీనటులు ఎందుకనో సైలెంట్ అయిపోయారు. దాంతో సినీ గ్లామర్ తో వైసిపి తళతళ లాడుతోంది.
ఈ నేపధ్యంలోనే సినీహీరో నాగార్జున లోటస్ పాండ్ కు వచ్చి జగన్ తో దాదాపు అర్ధగంటపాటు భేటీ అయ్యారు. ఆ భేటీనే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. సినీరంగాన్ని వైసిపివైపు మళ్ళించే స్క్రిప్ట్ మొత్తం తెలంగాణా సిఎం కెసియార్ కనుసన్నల్లోనే జరుగుతోందంటూ మండిపడ్డారు. ప్రతీదానికి జగన్ కు కెసియార్ కు కుదిరితే నరేంద్రమోడికి ముడేసి తిట్టటం చంద్రబాబుకు బాగా అలవాటైంది. గతంలో సినీరంగం టిడిపికి మద్దతుగా నిలబడినపుడు కాంగ్రెస్ ఏనాడు చంద్రబాబుపై మండిపడలేదు.
అందరూ తనకు మద్దతుగా నిలబడితే అందరూ గొప్పోళ్ళు. అదే జగన్ కు మద్దతుగా నిలబడితే మాత్రం సినీరంగం నేరగాడికి సరెండర్ అయిపోయింది...ఇది చంద్రబాబు లేటెస్ట్ స్లోగన్. టిడిపి, వైసిపిలకు మద్దతుగా బహిరంగంగా నిలబడిన సెలబ్రిటీలు పోను ఇంకా చాలామంది తటస్తులుగా ఉన్నారు. నిజంగానే వాళ్ళంతా కూడా జగన్ కు బాహాటంగా మద్దతుగా నిలబడినా, ఎన్నికల్లో ప్రచారం చేసినా చంద్రబాబు తట్టుకోగలరా ?