ఎన్నికలు దగ్గర పడుతున్న
కొద్దీ టిడిపి, కాంగ్రెస్ నుండి వైసిపిలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి.
ఎన్నికలన్నాక ఒకపార్టీలో నుండి మరో పార్టీలోకి వలసలు సాధారణమే అనుకోండి అది వేరే
సంగతి. అయితే, టిడిపిలో నుండి వచ్చిన
వారిని వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవటమే పలువురికి నచ్చటం లేదు.
టిడిపిలో నుండి ఇప్పటికే ఇద్దరు ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంపిలతో పాటు సీనియర్ నేత దాసరి జై రమేష్ టిడిపిలో చేరారు. అలాంటి వారిలో నాలుగున్నర సంవత్సరాల పాటు టిడిపిలో అన్నీ అధికారాలను అనుభవించి వైసిపిలో చేరిన చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ విషయంలోనే పార్టీలోని నేతలు మండిపోతున్నారు.
టిడిపిలో ఉన్నంత కాలం వైసిపి శ్రేణులపైనే కాకుండా మామూలు జనాల విషయంలో కూడా ఆమంచి ఎలా విరుచుకుపడిపోయారో అందరికీ తెలిసిందే. వైసిపి నేతలపై ఆమంచి అడ్డదిడ్డమైన కేసులు పెట్టించి నానా విధాలుగా హింసించారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఆమంచి టిడిపి తరపున పోటీ చేస్తే గెలిచేది కూడా అనుమానమే. టిడిపిలో టికెట్ విషయంలో అనుమానం లేకపోయినా ఓటమి భయంతోనే ఆమంచి వైసిపిలో చేరారన్నది వాస్తవం.
నియోజకవర్గంలోని అన్నీ వర్గాలకూ దూరమైన ఆమంచి కేవలం స్వార్ధంతోనే వైసిపిలోకి చేరారని వైసిపి నేతలంటున్నారు. అలాంటిది ఆమంచిని వైసిపిలోకి తీసుకున్న జగన్ నిర్ణయాన్ని పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గెలుపు కోసం పార్టీ మారిన ఆమంచి రాబోయే ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసినా గెలుపు అనుమానమే అంటున్నారు. ఆమంచి రాకపోతే ఈ సీటు వైసిపిదే అన్న వాళ్ళే ఇపుడు కచ్చితంగా గెలవదంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.
పార్టీ అధికారంలోకి వస్తుందా ? జగన్ సిఎం అవుతారా ? అన్నది కాదు ఇక్కడ సమస్య. నాలుగున్నరేళ్ళపాటు పార్టీ వైసిపి నేతలను నానా హింసలు పెట్టిన ఆమంచిని జగన్ అక్కున చేర్చుకోవటాన్నే జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోను ఆమంచిని జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు, జగన్ తరువాత అంతటి ప్రాధాన్యతున్న విజయసాయిరెడ్డి ఎదురెళ్ళి మరీ ఆహ్వానించటాన్ని సహించలేకపోతున్నారు.