ఒక్కోసారి అనూహ్య రాజకీయాలకు తెర లేస్తుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. తిరుగులేదనుకునే రాజకీయ నాయకులకూ షాక్ తగలవచ్చు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు వెలువడి దిగ్గజ రాజకీయ నాయకులకు షాక్ గురిచేశాయి. రాబోతున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చిత్రవిచిత్రాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కన్నెర్రజేస్తే ఏ విధంగా ఉంటుందో చెప్పబోతున్నారు నిజామాబాద్ రైతన్నలు. మద్దతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిజామాబాద్ జిల్లా రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ హక్కుల పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందనే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీకి తమ గళం వినిపించేలా అన్నదాతలు సిద్ధమవుతున్నారు.
మద్దతు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు గత కొద్దిరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు వెయ్యి మంది రైతులు సన్నద్ధమవుతున్నారు. అన్నదాతలు తీసుకున్న ఈ నిర్ణయం.. స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవితకు షాక్ గా పరిణమించింది.
బోధన్ తో పాటు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలు తెరుచుకోకపోవడంతో నిజామాబాద్ జిల్లా రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అదే క్రమంలో పసుపు, జొన్నకు మద్దతు ధర కల్పించాలంటూ కొన్నాళ్లుగా ఆందోళనలు చేపడుతున్నారు రైతన్నలు. తమ సమస్యలను అటు కేంద్రం గానీ..ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్నంగా నిరసన తెలుపుతున్నామని.. అందుకే లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించారు.
గత 2014 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి 10 మంది రైతులు పోటీచేశారు. ఐతే ఈసాది ఏకంగా వెయ్యి మంది రైతులు పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఏం జరగబోతుందని హాట్ టాపిక్గా మారింది.