ఎట్టకేలకు ఏపి ఎన్జీఓ సంఘం మాజీ నేత అశోక్ బాబుకు ముసుగు తొలగిపోయింది. ఈరోజు అశోక్ టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. అలా టిడిపి కండువా కప్పుకున్నారో లేదో ఇలా ఎంఎల్సీ అయిపోయారు. అంటే ఎంఎల్సీ పదవిని ముందే మాట్లాడుకున్నారు లేండి. ఎంఎల్సీ పదవి ఖాయమైన తర్వాతే అశోక్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఉద్యోగంలో ఉన్నంత కాలం, రాష్ట్ర విభజన సమయంలో కూడా అశోక్ టిడిపి ముసుగేసుకునే తిరిగేవారు.
పేరుకు ఉద్యోగుల సంఘం నేతగా చెలామణి అవుతున్నా లోపాయికారీగా ఆయన చంద్రబాబునాయుడు మనిషే అన్న విషయం ఎన్నోసార్లు రుజువైంది. చంద్రబాబు చెప్పినట్లు వినటం మొదలుపెట్టి చివరకు చంద్రబాబు జేబులో మనిషిగా మారిపోయారు. అందుకనే అశోక్ ను ఉద్యోగుల సంఘం నేతల్లో చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసి సమావేశాల్లో అయితే అశోక్ వైఖరిపై చాలామంది నేతలు నేరుగానే కడిగిపారేశారు. అయినా అశోక్ లెక్క చేయలేదు.
ఎప్పుడైతే టిడిపి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి బాహాటంగానే అధికారపార్టీ మనిషిగానే చెలామణి అయిపోయారు. దాంతో ఉద్యోగుల సంఘం నేత అనే హోదా నుండి టిడిపి నేత అనే స్ధాయికి చేరుకున్నారు. మొన్నటి కర్నాటక ఎన్నికల సమయంలో కూడా టిడిపి తరపున కర్నాటకకు వెళ్ళి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం సంచలనం సృష్టించింది. అశోక్ బాబులాగ ఇంతగా దిగజారిపోయిన ఉద్యోగుల సంఘం నేత గతంలో ఎవరూ లేరనే అపప్రదను మూటగట్టుకున్నారు.
అలాంటిది ఈ మాజీ నేతకు చంద్రబాబు టిడిపి జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తానికి అశోక్ బాగా లక్కీ ఫెలో అనే చెప్పాలి. ఎలాగంటే నేరుగా టిడిపిలోనే ఉంటూ దశాబ్దాల పాటు పార్టీ జెండాను మోసి, చొక్కాలు చించుకున్న వాళ్ళకు కూడా ఎంఎల్సీ పదవి దక్కలేదన్నది నిజం. అలాంటిది పార్టీలో చేరగానే ఎంఎల్సీ అవకాశం వరించిందంటే లక్కీ కాక మరేంటి ? కాకపోతే రేపటి ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు టిడిపికి అశోక్ వేయించగలరన్న ఏకైక నమ్మకంతోనే అశోక్ ను చంద్రబాబు నెత్తినెక్కించుకున్నారు. మరి ఆ పని అశోక్ చేయగలరా ?