ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకొస్తున్న క్రమంలో ప్రధాన పార్టీల అధ్యక్షులు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై పోయారు. ముఖ్యంగా వైసిపి టిడిపి పార్టీల మధ్య అభ్యర్థుల విషయంలో ఒకరికి మించి ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల బరిలోకి తమ పార్టీల తరఫున అభ్యర్థులను ఎంపిక చేసుకునే కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఈ క్రమంలో గతంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి భీమిలి నియోజకవర్గం నుండి ఎన్నికైన గంటా శ్రీనివాసరావు చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. అయితే రానున్న ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నానని అన్నారు.
అంతేకాకుండా భీమిలి నియోజకవర్గం నుండి మంత్రి నారా లోకేష్ పోటీ చేయాలని అనుకుంటున్నారన్న వార్త తనకు పత్రికల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. తాను అయితే భీమిలి నుంచే పోటీచేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇదే విషయాన్ని ఇప్పటికే తెదేపా అధినేత, సీఎం చంద్రబాబుకు తెలియచేశానని ఆయన అన్నారు. జిల్లాల్లో సీట్ల కేటాయింపుపై పార్టీ సమీక్షలు నిర్వహిస్తోందని చెప్పారు. పోటీ విషయంలో సీఎం చంద్రబాబు ఆదేశాలను శిరసావహిస్తానని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గంటా అన్నారు. మొత్తం మీద గంటా శ్రీనివాస్ రాబోయే ఎన్నికల్లో కూడా భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కరాఖండిగా చెప్పేశారు.