హైదరాబాద్ ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏపీకి సంబంధించిన ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ జరిగిందని వైసీపీ అంటుంటే.. తెలంగాణ సర్కార్ సహకారంతో వైసీపీ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి లోకేష్ తీరు విమర్శలపాలవుతోంది. ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేస్తున్న లోకేష్పై హైదరాబాద్కు చెందిన పలువురు ఆన్లైన్లో మండిపడుతున్నారు.
లోకేష్ చేసిన ఒక ట్విట్...
ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టినా మీకు బుద్ది రాలేదు. అమెరికాలో పర్సు పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా? లేక హైదరాబాద్ లో చేస్తారా? ఆంధ్రప్రదేశ్ కి చెందిన డేటా పోయింది అని ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలి అని కూడా మీకు తెలియదా?
ఈ ట్విట్ చేసిన లోకేష్పై విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ను అమెరికాతో పోల్చుతారా..? పదేళ్ల పాటు ఏపీ-తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయం తెలియదా? అంటూ లోకేష్ను విమర్శిస్తున్నారు.
మరో ట్విట్లో జగన్ను ఉద్దేశించి.. హైదరాబాద్లో ఉంటూ ఏపీ ప్రజల ఓట్లు అడుగుతున్నారంటూ జగన్పై పరోక్షంగా విమర్శలు చేశారు లోకేష్. హైదరాబాద్లో ఉంటే ఏపీ ప్రజల ఓట్లు అడగకూడదా? లోకేష్, చంద్రబాబు గతంలో ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ రాకుండానే ఏపీ రాజకీయాల్లో కొనసాగాలా? హైదరాబాద్ రాకుండా, హైదరాబాద్లో బిజినెస్లన్నీ క్లోజ్ చేసుకుని రాజకీయాల్లో ఉండూ లోకేష్.. అంటూ వైసీపీ నేతలు లోకేష్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.