ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు డేటా చుట్టూ తిరుగుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీ లో ఆంధ్ర ప్రదేశ్ డేటా వెలుగు చూడటం తో రాజకీయంగా దుమారం రేపింది. ఏపిలో డేటా చోరీ జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుల పై విచారణ చేస్తున్న సైబరాబాద్ పోలీసులు చేస్తున్న వ్యాఖ్యలు..వేస్తున్న అడుగులు చూస్తుంటే ఇది ఏపిలోని కీలక మంత్రి ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వ్యాఖ్యల పరమార్ధం కూడా ఇదే అనే చర్చ సాగు తోంది. ఏం జరిగింది...ఏం జరగబోతోంది.
ఈ వ్యవహారం మొత్తంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ చేసిన వ్యాఖ్యలతో లోతుగా పరిశీలిస్తే మంత్రి లోకేష్ చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఐటీ గ్రిడ్స్ డాటా స్కామ్ వెనుక ఎవరు ఉన్న కఠిన చర్యలు తప్పవని కమిష నర్ సజ్జనార్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో అవసరమనుకుంటే అక్కడి మంత్రులు..అధికారులకు నోటీసులు ఇస్తా మని స్పష్టం చేసారు. కేసును అడ్డుకోవటానికే ఏపి పోలీసులు కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేసారు.
ఐటి గ్రిడ్స్ వద్ద కు ఈ సమాచారం ఎలా వచ్చిందనే దాని పై నే సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. అదే విధంగా క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగించారనే అంశం పైనా కూపీ లాగుతున్నారు. ఇప్పటికే అమెజాన్ క్లౌడ్ ద్వారా దీనిని అనుసంధానం చేసారని.. ఆ సంస్థకు నోటీసులు ఇచ్చామని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. అయితే, అసలు ఈ డేటా ఏపి ప్రభుత్వంలో ఎవరి ద్వారా వచ్చింది..దీనికి ఎవరు బాధ్యులనే అంశం పై దృష్టి సారించారు.