ఐటీ గ్రిడ్ ఇపుడు బాగా ట్రెండీ అవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ మాట చుట్టూనే రాజకీయం మొత్తం రచ్చ చేస్తోంది. ఐటీ గ్రిడ్ పేరిట అటు టీడీపీ, ఇటు వైసీపీ, ఇంకో వైపు తెలంగాణా సర్కార్ ఇలా మోహరించి ఉన్న వేళ ఏం జరుగుతోందన్నది సామాన్యున్ని తెగ వేధిస్తోంది. సున్నితమైన అంశాలతో పాటు, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయాయన్నది జనానికి కలవరపాటు కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు ఐటీ గ్రిడ్ మీద అయిదు ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తున్నాయి.
1. హైదరాబాద్లో ఐటీ గ్రిడ్ సంస్థ మీద తెలంగాణాల పోలీసుకు తనిఖీకి వెళ్ళింది ఫిబ్రవరి 23. ఆ రోజున అక్కడ ఉన్న సీఈఓ అశోక్ ని విచారణకు పోలీసులు పిలిచారు. వస్తానని చెప్పి 25 నుంచి అశోక్ పరారీలో ఉన్నాడు. అయితే ఆ విషయం అపుడే తెలిసినా టీడీపీ పెద్దలు ఇన్నాళ్ళూ మిన్నకుండిపోవడం వెనక కారణమేంటి. తమ సంస్థపై పోలీసులు దాడి చేస్తున్నారని నాడే ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు ?
2. టీడీపీ డేటా పోయిందని ఇపుడు తాపీగా గగ్గోలు పెడుతున్న టీడీపీ దాని మీద ఫిర్యాదు కేసు నడుస్తున్న హైదరాబాద్లో ఎందుకు చేయలేదు. గుంటూర్లో ఏసీపీకి ఇచ్చిన ఫిర్యాదులో ఫలానా వారి మీద చర్యలు తీసుకోండని ఎందుకు ప్రస్తావించకుండా ఉత్తుత్తి ఫిర్యాదులు చేసి వూరుకుందన్న అనుమానాలు ఇపుడు అందరిలో కలుగుతున్నాయి.
3. ఐటీ గ్రిడ్ కి ఇప్పటి వరకూ సరైన రిజిస్ట్రేషన్ కూడా లేదని న్యూస్ వైరల్ అవుతోంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన తమ డేటా పోయిందని గోల పెడుతున్న టీడీపీ అతి చిన్న సంస్థను, అధికారికంగా నమోదు కూడా కాని సంస్థను ఏ విధంగా నమ్మి విలువైన పార్టీ డేటాను ఏ అనుబంధంతో ఇచ్చిదన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.
4. అమరావతికి ఐటీ పరిశ్రమలు రావాలని టీడీపీ ప్రభువులు హడావుడి చేస్తారు కదా మరి. ఐటీ గ్రిడ్ ని హైదరాబాద్ లో ఎందుకు ఏర్పాటు చేయించారో చెప్పగలరా. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ, పార్టీ పనులు అప్పగిస్తూ కూడా దాన్ని అమరావతికి ఎందుకు తీసుకురాలేకపోయారో కూడా వివరిస్తారా..?
5. ఐటీ గ్రిడ్ కి ఇచ్చిన ప్రభుత్వ డేటా అంతా కేంద్రం ఆధీనంలోని సంస్థలవి కావడం ఇక్కడ విశేషం. ఆధార్ కార్డ్ అయినా బ్యాంకు ఖాతాలు అయినా, ఆఖరుకు ఎన్నికల సంఘం మాస్టర్ కాపీ అయినా డిల్లీకి సంబంధించినవే. అంటే ఇపుడు కేసీఅర్, జగన్ అని బయటకు అంటున్నా కేంద్ర సంస్థల డేటావే మొత్తం చోరీ అయిందని తెలిస్తే కేంద్ర సర్కార్ ఈ విషయంలో ఏ చేయబోతోంది. ?