లోకేష్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏకంగా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిపోయాడు. దింతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎంతసేపూ ఆన్ లైన్లోనే గడుపుతున్నారు మంత్రి లోకేష్ బాబు. అసలు ఆన్ లైన్ నుంచి బయటకు వచ్చి స్పందించేది ఏమీలేకుండా పోయింది. లోకేష్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి బహుశా నెలలు గడిచిపోయాయేమో. రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా ఉండాల్సిన సమయంలో కూడా లోకేష్ బాబు ట్వీట్లు పెడుతూ పొద్దు పుచ్చుతూ ఉండటం గమనార్హం!
ట్వీటేస్తే ఓట్లు రాలతాయా? అనే విషయాన్ని లోకేష్ కే వదిలేస్తే, ఇంతకీ ఆయన పోటీ కథ ఏమిటి? అంటే.. ఇప్పుడు మళ్లీ వ్యవహారం మొదటకు వచ్చిందనే టాక్ వినిపిస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో లోకేష్ పోటీచేస్తారా? అనేది అనుమానాస్పదంగానే మారుతోంది. భీమిలి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి లోకేష్ పోటీ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అది లీకేజీ మాత్రమే. అధికారిక ప్రకటన కాదు. అయితే ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.
నెలరోజుల్లో పోలింగ్ జరగనుంది.ఇలాంటి నేపథ్యంలో భీమిలికి దారి, భీమిలి సరిహద్దులు కూడా తెలియని లోకేష్ బాబు.. అక్కడ నుంచి పోటీ చేస్తారా? అనేది సందేహంగానే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఏపీలో పోలింగ్ ఏ ఆఖరి విడతలోనే ఉంటే.. లోకేష్ భీమిలి నుంచి పోటీచేయడానికి అవకాశాలు ఉండేవని.. కానీ కేవలం నెలరోజుల్లోనే పోలింగ్ ఉన్న నేపథ్యంలో.. లోకేష్ అక్కడకు మకాం మార్చడానికి కూడా కాస్త సమయం పట్టడం ఖాయం. అసలే తొలిసారి నామినేటెడ్ పదవితో మంత్రి అయ్యి లోకేష్ విమర్శలపాలయ్యారు. అలాంటిది సొంతూరు, సొంత సామాజికవర్గం జనాలు లేని చోటకు వెళ్లి.. నెలరోజుల్లో ఒక కఠిన పరీక్షను ఎదుర్కొనడానికి లోకేష్ సిద్ధంగా లేరని సమాచారం.