అవును ఇపుడీ విషయంపైనే
రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ
అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి తరపున జేడి లక్ష్మీనారాయణ పోటీ చేయబోతున్నట్లు
చంద్రబాబునాయుడు మీడియానే కన్ఫర్మ్ చేస్తోంది. దాంతో జేడి ముసుగు తొలగిపోయినట్లే
అంటే చర్చలు జోరందుకున్నాయి.
నిజానికి లక్ష్మీనారాయణ అనే పేరుతో సిబిఐలో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఓ అధికారి పనిచేస్తున్నారని తెలిసింది చాలా తక్కువమందికే. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు పెట్టటం, దర్యాప్తు మొదలుపెట్టటంతోనే లక్ష్మీనారాయణ ఉమ్మడి ఏపిలో బాగా పాపులరయ్యారు. దాంతో జాయింట్ డైరెక్టర్ అనే హోదానే లక్ష్మీనారాయణకు ఇంటిపేరుగా మారిపోయింది. అప్పటి నుండి జేడి లక్ష్మీనారాయణ అయిపోయారు.
జగన్ పై కేసుల దర్యాప్తులో జేడి ఎంతటి అత్యుత్సాహం చూపారో అందరూ చూసిందే. ఒకదశలో జేడి వ్యవహారశైలితో చంద్రబాబు ఆదేశాల మేరకే లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారనే ప్రచారం కూడా బాగా జరిగింది. దాంతో జేడి చంద్రబాబు మనిషే అన్న ముద్రపడిపోయింది. కాకపోతే చంద్రబాబు మీడియా ఇచ్చిన హైప్ కారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో, జగన్ ను వ్యతిరేకించే వాళ్ళల్లో జేడి క్రేజ్ బాగా పెరిగిపోయింది.
అలాంటిది జేడిని తర్వాత కాలంలో కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది. తర్వాత కొంత కాలానికి జేడి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి దిగారు. కొత్తపార్టీ పెడతానని కొంతకాలం హడావుడి కూడా చేశారు. ఆ తర్వాత లోక్ సత్తా సారధ్య బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. సరే ఏ ప్రచారం ఎలాగున్నా తనకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి తీసుకోవాలనుందని జేడి చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. జేడి వ్యవసాయ శాఖ మంత్రిపదవి అందుకునే అవకాశాలు ఏమున్నాయో తెలీక అందరూ అప్పట్లో జుట్లు కూడా పీక్కున్నారు లేండి.
తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత చూస్తే జేడి టిడిపిలో చేరబోతున్నట్లు చంద్రబాబు మీడియా బయటపెట్టింది. భీమిలీ నుండి పోటీ చేస్తారని కూడా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో జేడి అయితే ఏమీ స్పందించటం లేదు. ఏ విషయం మీదైనా ముందుగా తన మీడియాతో చెప్పించి జనాల స్పందన చూసి తర్వాత ప్రకటించటం చంద్రబాబుకు అలవాటే. ఈ విషయంలో కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నారు. భీమిలీలో గెలుపోటములను పక్కనపెడితే జేడి, చంద్రబాబు ఒకటే అన్నది బయటపడింది.