హైద‌రాబాదీల‌కు తీపిక‌బురు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అమీర్ పేట్ – హైటెక్ సిటీ మార్గంలో రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో రైళ్లు నడపడానికి కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సిఎంఆర్ఎస్) తాజాగా అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి, ప్రచారం, ఆర్బాటం లేకుండా సాదాసీదాగానే ఈ రూట్ లో మెట్రో రైళ్ల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. దీంతో కొద్ది రోజుల్లోనే హైటెక్ సిటీ మార్గంలో రైలు సేవలను అందుబాటులోకి తేవాలని మెట్రో రైలు అధికారులు తుది ఏర్పాట్లు చేస్తున్నారు. 


వాస్తవానికి అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైళ్ల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నగరంలోని నలుమూలల నుంచి వీరు పనిచేసే ప్రాంతాలకు వస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మార్గంలో రైళ్లు నడపడానికి మార్గం సుగమం కావడంతో వారికి ఎంతో ఊరట లభిస్తుంది. ఈ మార్గంలో అమీర్ పేట, మధురానగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5,  జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లుంటాయి. ఈ మార్గం కూడా అందుబాటులోకి రానుండడంతో ఇప్పుడు హైదరాబాద్ లో మూడు కారిడార్లలో సేవలు అందుతున్నట్లు లెక్క.


ఈ కారిడార్ లో మెట్రో రైళ్లు నడపడానికి గత నవంబర్ మాసం నాటికే అన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. నాలుగు నెలలుగా ఈ కారిడార్ లో ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల కోసం రైళ్లు నడపడానికి సిఎంఆర్ఎస్ అనుమతి తప్పనిసరి కావడంతో మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు ఇంతకాలం వేచి చూశారు. తాజాగా ఆ అనుమతి రావడంతో ఆ రూట్లలో ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. కాగా, 29 కిలోమీటర్ల మియాపూర్ – ఎల్.బి. నగర్ లైను, 17 కిలోమీటర్ల నాగోల్ – అమీర్ పేట లైను ఇప్పటికే ప్రారంభం అయింది. 10 కిలోమీటర్ల అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో లైను మొదలవుతుండడంతో మొత్తం 56 కిలోమీటర్ల నిడివి కలిగిన మెట్రో మార్గం అందుబాటులోకి వ‌స్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: