తూర్పు జయప్రకాష్ రెడ్డి....కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ అంటే విరుచుకుపడే నేతగా ఆయన గురించి అందరికీ తెలుసు. గత కొద్దికాలంగా, కేసీఆర్ విషయంలో తన దారిని మార్చుకున్న ఆయన తాజాగా అది మరింత తీవ్రతరం చేశారు. ఒకప్పుడు కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి ఇటీవల పొగడ్తల్లో ముంచెత్తులున్నారు. కేసీఆర్ వల్లే రాజకీయ జీవితమని పేర్కొన్నారు.
దీంతోపాటుగా కేసీఆర్ కుటుంబంతో ఎటువంటి వైరంలేదని, రాజకీయంగా విమర్శలు చేశాను తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శలు చేయలేదని జగ్గారెడ్డి ప్రకటించారు. బీజేపీలో రాజకీయంగా అణగ దొక్కబడిన తర్వాత 2001లో కేసీఆర్ పిలిచి సంగారెడ్డి టికెట్ ఇచ్చారని చెప్పారు. 2004లో టిఆర్ఎస్ టికెట్ పై పోటీచేసి గెలిచి కేసీఆర్ వల్ల రాజకీయ పునరుజ్జీవం పొందానని జగ్గారెడ్డి అన్నారు. తనను జైల్లో పెట్టడంవల్లే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యానని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఒకవైపు కేసీఆర్ ను పొగుడుతూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీని జగ్గారెడ్డి విమర్శించారు. తనకు కష్టం వస్తే పార్టీ ఆదుకుంటుందన్న విశ్వాసం పోయిందని ఆరోపించారు.
ఇలా సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో జగ్గారెడ్డి కూడా ఉన్నారనే చర్చ జరిగింది. తాజాగా అదే నిజమైంది. టీఆర్ఎస్లో చేరేందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిద్ధంగా ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. నేడో, రేపో జగ్గారెడ్ది గులాబీ గూటికి చేరనున్నట్లు సమాచారం. జగ్గారెడ్డి చేరికతో కాంగ్రెస్కు ఊహించని షాక్ ఖాయమని పలువురు చర్చించుకుంటున్నారు.