ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించేందుకు ప్రియాంకా గాంధీ విశ్వప్రయత్నాలూ చేస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిగా నిర్జీవమైపోయిన పార్టీని కనీసం పట్టాలమీదకు తెచ్చే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు, సోదరుడు రాహుల్ గాంధీ.. ప్రియాంక మీద పెట్టారు. దీంతో ఆమె ఉత్తర ప్రదేశ్ లో ప్రచారం ముమ్మరం చేశారు. ప్రియాంక రాకపోయి ఉంటే కాంగ్రెస్ మరింత తుడిచిపెట్టుకుపోయి ఉండేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ ప్రచారం ప్రారంభించారు. లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను ప్రియాంక తనమీద వేసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె గంగాయాత్ర చేపట్టారు. ప్రయాగ్ రాజ్ లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె త్రివేణి సంగమం చేరుకుని ప్రచారం ప్రారంభించారు. మూడు రోజులపాటు పడవపైనే ప్రచారం చేయనున్నట్టు వెల్లడించారు. దీనికి గంగాయాత్రగా నామకరణం చేశారు. పడవపై ప్రయాణిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.
గంగానదీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకోవడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. 3 రోజులపాటు జరిగే ఈ యాత్ర సుమారు 140 కిలోమీటర్ల మేర సాగనుంది. మధ్యమధ్యలో ఆగుతూ ప్రజలతో ఆమె ముచ్చటించనున్నారు. వారి సమస్యలు తెలుసుకోనున్నారు. చివరిరోజు వారణాసిలోని అస్సీ ఘాట్ లో యాత్ర ముగియనుంది. కాశీ విశ్వనాథుని దర్శనంతో ప్రియాంగ గంగాయాత్ర ముగియనుంది.
గతంలో ప్రియాంక నానమ్మ ఇందిర గాంధీ కూడా గంగాయాత్ర చేశారు. నాడు గంగాయాత్ర ఇందిరకు సత్ఫలితాలిచ్చింది. ఇప్పడు ప్రయాంక కూడా ఆమె బాటలోనే పయనిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. నాడు ఇందిర కూడా హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. ఇప్పుడు ప్రియాంక కూడా అదేబాటను ఎంచుకున్నారు. ప్రియాంక గంగాయాత్ర కోసం ప్రత్యేక బోటును సుందరంగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్ జెండాలతో దాన్ని నింపేశారు. యాదవేతరులు నివసించే ప్రాంతాల్లో సాగేవిదంగా ఈ యాత్రను రూపొందించారు. యూపీలో 14 శాతం మంది యాదవేతరులు ఉన్నారు.
ప్రయాంక యూపీలో అడుగు పెట్టక ముందు వరకూ ఎస్పీ – బీఎస్పీ కూటమిదే పైచేయి. 80 స్థానాల్లో 50కి పైగా స్థానాలను ఆ కూటమి గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు ప్రియాంక రాకతో బీజేపీ ఓటు బ్యాంకును ఎస్పీ-బీఎస్పీ కూటమితో పాటు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోందని తెలుస్తోంది. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎస్పీ-బీఎస్పీ కూటమికి మద్దతు పలుకుతోంది. తద్వారా బీజేపీని ఓడించేందుకు వ్యూహరచన చేసింది.