గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ తన పార్టీ తరఫున బరిలో దిగే లోక్సభ అభ్యర్థుల గురించి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై సోమవారం ఉదయం నుంచి బాగా పొద్దుపోయేంత వరకు కరసత్తు చేసిన తెరాస అధినేత కేసీఆర్ ఎనిమిది నియోజకవర్గాల్లో బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లకు సంబంధించి ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. మిగతా ఎనిమిది చోట్ల సిట్టింగ్ ఎంపీలను మార్చాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని ఆ నియోజకవర్గాల్లో ఎవరిని పోటీకి పెట్టాలన్న అంశంపై తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను విశ్లేషించి అభ్యర్థిత్వాలను ఖరారుచేసే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మల్కాజిగిరి లోక్సభపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మల్కాజ్గిరి బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీకి దిగడంతో బలమైన అభ్యర్థిని నిలపాలన్న నిర్ణయానికి తెరాస అధినేత కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్ సమీప బంధువు నవీన్రావు పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆయనతో పాటు కార్మీకశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు రాజశేఖరరెడ్డి, మరో పారిశ్రామికవేత్త రంజిత్రెడ్డి, ఐఏఎస్ అధికారి వెంకట్రాంరెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది.
మల్కాజిగిరి స్థానం నుంచి రంజిత్రెడ్డి, సబిత తనయుడు కార్తీక్రెడ్డితో పాటు మాజీమంత్రి పట్నం మహేందర్రెడ్డి అభ్యర్థిత్వాలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బలమైన అభ్యర్థినే బరిలో దింపాలని ఈ సందర్భంగా కేసీఆర్ సన్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ పేర్లను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.