తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో జరుగుతున్న ఎన్నికల గురించి సంచలన జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని వెల్లడించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు 120-130 సీట్లు వస్తాయని తలసాని వెల్లడించారు.
ఏపీలో ఓడిపోతాననే భయంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని తలసాని మండిపడ్డారు. ``చేసింది చెప్పుకోలేక చంద్రబాబు చిల్లరగా,దుర్మార్గం గా మాట్లాడుతున్నారు. చంద్రబాబువి అన్నీ దొంగ మాటలే. హైదరాబాద్లో టీడీపీ నేతలకు ఆస్తులుంటే టీఆర్ఎస్ వారిని బెదిరిసున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు బాబు అలా మాట్లాడుతున్నారు. సెంటిమెంటు రెచ్చగొట్టే తెలివి కూడా బాబుకు లేదు. జగన్కు బాబు మాటలే ఫ్రీ పబ్లిసిటీ! అందరీ చరిత్రలు బయట పెడతా అని బాబు అంటున్నారు....బాబు చరిత్ర నా దగ్గర ఉంది`` అని వ్యాఖ్యానించారు.
ఓటుకు నోటు కేసులో దొరికి అమరావతికి పారిపోయిన దొంగ చంద్రబాబు అని తలసాని మండిపడ్డారు. ``పసువు-కుంకుమ పేరిట ఇస్తున్న డబ్బులను ఎన్నికల తర్వాత బాబు ఇవ్వరు. ఇది దగా మోసం. కేసీఆర్ను ప్రతి క్షణం తలుచుకోవడమే చంద్రబాబు బతుకు. బాబు ప్రసంగాలతో జనాలకు బోర్ కొడుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం మాట దేవుడెరుగు...విజయవాడలో కనక దుర్గ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కట్టలేకపోయారు. ఏపీ ప్రజలు మోసగాడైన చంద్రబాబును ఇంటికి పంపాలని ఎపుడో నిర్ణయించుకున్నారు. వైసీపీ 120 నుంచి 130 సీట్లు గెలవబోతోంది ..రాసి పెట్టు కోండి. 22 -23 ఎంపీ సీట్లు వైసీపీ కొస్తాయి. ఓడిపోయాక చంద్రబాబు చేరుకునేది హైదరాబాద్ ఇంటికే`` అని వ్యాఖ్యానించారు.