అజారుద్దీన్.. టీమిండియాకు ఒకప్పుడు ఘన విజయాలు అందించిన క్రికెట్ కెప్టెన్. అయితే ఇప్పుడాయన భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. క్రికెట్ లో ఎన్నో విజయాలు నమోదు చేసిన అజారుద్దీన్.. తన సెకండ్ ఇన్నింగ్స్ అయిన పాలిటిక్స్ లో మాత్రం ఆయన జర్నీ అంత సాఫీగా సాగట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఆయనతో ఒక ఆట ఆడుకుంటోంది. ఈసారి అయన్ను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనేదానిపై ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు.
ఈ ఎన్నికల్లో అజారుద్దీన్ ను తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపబోతోందనే ప్రచారం భారీగా జరిగింది. ఇందుకు తగ్గట్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో అజారుద్దీన్ కూడా సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో దిగాలని ఉత్సాహం చూపించారు. ఆ సీటు కోసం అంజన్ కుమార్ యాదవ్ కూడా తీవ్రంగా లాబీయింగ్ చేశారు. దీంతో ఆ సీటును అంజన్ కుమార్ యాదవ్ కి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ అధిష్టానం అజార్ ను పక్కన పెట్టేసింది. అయితే అజార్ కి హైదరాబాద్ సీటు ఇస్తామని ప్రకటించింది.
హైదారాబాద్ లో ఎంఐఎం తరఫున ఒవైసీ బరిలో ఉన్నారు.. ఆయన మీద పోటీకి దిగడానికి అజారుద్దీన్ ఇష్టపడలేదు. ఆ సీటు తీసుకోవడానికి నిరాకరించారు. అధిష్టానం అజార్ ను ఒప్పించే ప్రయత్నం చేసింది.. అజార్ హైదరాబాద్ నుంచి పోటీకి ఒప్పుకున్నారని.. ఈసారి అక్కడ హోరాహోరీ పోరు ఉంటుందని భారీ ప్రచారమే జరిగింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో అజారుద్దీన్ పేరు లేదు. హైదరాబాద్ సీటును మైనార్టీ నేత ఫిరోజ్ ఖాన్ కు కేటాయించారు. ఇది అజారుద్దీన్ కి పెద్ద షాకే అంటున్నాయి పార్టీ వర్గాలు.
అజారుద్దీన్ 2009లో ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి సొంతగడ్డ నుంచి అదృష్టం పరీక్షించుకోవాలని అజారుద్దీన్ భారీవించారు. కానీ అధిష్టానం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. అజారుద్దీన్ కి బీదర్ సీటు కేటాయిస్తారంటూ ఇప్పుడు మరో ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే అందులో నిజమెంతో చెప్పలేని పరిస్థితి.
జాతీయ స్థాయిలోని సీనియర్ నేతలతో అజారుద్దీన్ కి బలమైన సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమయంలో పార్టీ ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. స్టార్ క్యాంపెనర్ గా నియమించారు. అయితే ఆ బంధాలు ఈసారి అజార్ కి అంతా వర్క్ అవుట్ అవుతున్నట్టు కనిపించడంలేదు. అందుకే ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయని.. కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
కొన్నాళ్ల క్రితం.. అజారుద్దీన్ కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి.. కారు ఎక్కేందుకు సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఒవైసీ సోదరులే మధ్యవర్తులుగా వ్యహరించారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నేతలు ఆయన్ని బుజ్జగించి పార్టీలో కొనసాగేలా ఒప్పించారు. ప్రస్తుత పరిణామాలతో అజారుద్దీన్ తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగుతారా..? లేక గులాబీ గూటికి చేరతారా అన్నది ఆసక్తికరంగా మారింది.