బీఎస్పీ అధినేత్రి మాయవతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా.. నామినేషన్ వేస్తే చాలు.. గెలిపించే వ్యవహారం కార్యకర్తలు చూసుకుంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే తాను గెలవడం కంటే.. తమ కూటమి గెలవడమే ముఖ్యమని ఆమె చెబుతున్నారు.
బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని మాయవతి కుండబద్దలు కొట్టారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో కాంగ్రెస్ కి చోటిచ్చేందుకు కూడా మాయవతి ఏమాత్రం అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు ప్రియాంక గాంధీ తీసుకుంటున్నారని ప్రకటించినా.. మాయావతి వెనక్కి తగ్గలేదు. మాయావతి ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి భారీ సంఖ్యలో సీట్లు సాధిస్తే.. ప్రధానమంత్రి పదవి కోసం బేరసారాలు సాగించాలన్నది మాయావతి ప్లాన్ అంటూ భారీగా ప్రచారం జరిగింది. మాయవతి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతూనే ఉన్నారు. అటువంటి మాయవతి పోటీకి దూరం అని ప్రకటించడం రాజకీయ విశ్లేషకులన్ని సైతం ఆశ్చర్యపరిచింది.
మాయవతి తన ఒక్క సీటు మీద దృష్టి పెట్టదల్చుకోలేదు. ఇప్పుడు ఆమె దేశమంతటి మీద దృష్టిపెట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఎస్పీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసింది. ఈసారి కూడా దేశవ్యాప్తంగా పోటీకి మాయవతి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీఎస్పీ మూడు, నాలుగు సీట్లను సంపాదించుకుంది, ఓటింగ్ శాతాన్ని భారీగా పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే మాయవతి దేశ రాజకీయాల మీద పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలో పోటీకి దిగడమే కాదు.. మాయవతి భారీ ఎత్తున ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు.
మహరాష్ట్ర, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సైతం ఆమె పర్యటనలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాను పోటీ చేస్తే.. ముందకాళ్లకు బంధనంలా ఉంటుందని.. బరిలో లేకపోతే స్వేచ్ఛ తిరిగి ప్రచారం చేయడం ద్వారా.. దేశవ్యాప్తంగా బీఎస్పీని బలోపేతం చేయడంతో పాటు వీలైనన్ని ఎక్కువ సీట్లు గెల్చుకోవాలన్నదే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది.
యూపీలో అత్యధి సీట్లను గెల్చుకోవడం తోపాటు.. మిగతా రాష్ట్రాల్లోనూ గట్టిగా ప్రయత్నిస్తే.. మరో 10 సీట్లు అదనంగా సంపాదించుకోవచ్చన్నది మాయవతి వ్యూహంగా కనిపిస్తోంది. దీనితో పాటుగా ఆమె కొన్ని ప్రాంతీయ పార్టీలతోనూ పొత్తులకు సిద్ధమవుతున్నారు. ఆ పొత్తు ద్వారా కొన్ని సీట్లు సంపాదించుకోగలిగితే.. అవి జాతీయ స్థాయిలో తనను ప్రధానమంత్రిగా ప్రొజెక్టు చేసుకునేందుకు ఉపయోగపడుతుందనేది మాయవతి ప్లాన్. మరి ఆమె టార్గెట్ ఏమేరకు రీచ్ అవుతుందో వేచి చూద్దాం..