'మా' ఎన్నికల్లో జరిగిన విమర్శలు, పెద్ద యుద్ధాన్నే తలపించింది. శివాజీ రాజా ఏకంగా నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధమైంది. తాజాగా జనసేన పార్టీలో చేరిన నాగబాబు, ఆ పార్టీ తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడతడ్ని దెబ్బకొట్టేందుకు శివాజీ రాజా వైకాపాలో చేరబోతున్నారట. ఈనెల 24న నరసాపురంలో ప్రచారసభ నిర్వహించబోతున్నారు జగన్.
ఆ బహిరంగ సభలోనే వైకాపాలో చేరి, అదే వేదికపై నుంచి నాగబాబుపై కౌంటర్లు స్టార్ట్ చేయాలని శివాజీరాజా నిర్ణయించారు. శివాజీరాజాను చేర్చుకునేందుకు జగన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారట. నిజానికి నరసాపురంలో జనసేన గెలుపుకోసం టీడీపీ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిపెట్టింది. జనసేన-టీడీపీ మధ్య కుదిరిన తెరవెనక ఒప్పందం ప్రకారం.. ఆ స్థానంలో శివరామరాజు లాంటి డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది.
కాపు సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడ్ని కావాలనే ఆ స్థానం నుంచి తప్పించారు. ఆ తర్వాత చైతన్యరాజును దించాలని అనుకున్నప్పటికీ, పవన్ సూచన మేరకు ఆయన్ను కూడా తప్పించారట. అలా పలువురి చేతులు మారి శివరామరాజును నిలబెట్టారు. మరోవైపు వైసీపీ నుంచి రఘురామ కృష్ణంరాజు బరిలో నిలిచారు. ఇతని తరఫునే శివాజీరాజా ప్రచారానికి దిగబోతున్నారు. కేవలం నరసాపురం నియోజకవర్గం వరకే శివాజీ రాజా ప్రచారం చేస్తారా లేక జగన్ చెప్పే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా జగన్ తో పాటు పాల్గొంటారా అనేది తేలాల్సి ఉంది.