తెలంగాణలో ఆంధ్రోలను కొడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇక్కడ 29 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉంటున్నారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల మధ్య ప్రజలను ఇబ్బంది పడేలా వ్యవహరించొద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే గాజువాక, భీమవరంలలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్... బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణకు వెళ్తే ఆంధ్రవాళ్లను కొడుతున్నారనే వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్.
ఇక జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని కేసీఆర్కు నమస్కరించి కోరుతున్నట్లు చెప్పారు. ఇక గాజువాకలో పవన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్ పెరిగింది. అంతకుముందు ఓ సందర్భంలో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ ,లేదా ఆయన పార్టీ తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీచేసుకోవచ్చని అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోవాలని హైదరాబాద్లో నివసిస్తున్న సెటిలర్లు చెప్పారు.
హైదరాబాదులో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. కేవలం రాజకీయంగా పబ్బం గడపడం కోసమే పవన్ వ్యాఖ్యలు చేసి ఉంటారని హైదరాబాదులోని సెటిలర్లు చెబుతున్నారు. రాజకీయంగా ఏమైనా ఉంటే అది రాజకీయంగానే చూసుకోవాలని ప్రశాంతంగా హైదరాబాదులో జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పారు. తమను ప్రభుత్వం హింసకు గురించేస్తుందని ఏరోజైనా తనతో చెప్పామా అని ప్రశ్నించారు. ఇది ఒక్క పవన్ కళ్యాణ్కే వర్తించదని చెప్పిన సెటిలర్లు... ఏపీలో ఏ రాజకీయనాయకుడు లేదా పార్టీ ఇలాంటి కామెంట్స్ చేయొదన్ని కోరారు. తమ సొంత ప్రయోజనాల కోసం తెలంగాణలో సామరస్యంగా జీవిస్తున్న ప్రజలను డిస్టర్బ్ చేయొద్దని వేడుకున్నారు.