విశాఖ జిల్లాలో పేరున్న నియోజకవర్గాల్లో నర్శీపట్నం ఒకటి. ఇక్కడ టీడీపీ సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఇప్పటికి ఎనిమిది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆరుసార్లు అయ్యన్న గెలిచి అక్కడ బలమైన పునాదులు ఏర్పాటు చేసుకున్నారు. 1989, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ జయపతాక ఎగురవేసింది. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో మరోమారు గెలిచి రికార్డ్ స్రుష్టించాలని అయ్యన్న ఆరాటపడుతున్నారు. అయితే ఆయన కుటుంబంలోనే చెలరేగిన వర్గపోరు గెలుపుపై నీలినీడలు ప్రసరింపచేస్తూ వచ్చింది. ఎన్నికల వేళ దానికి దిద్దుబాటు చేసుకునే పనిలో మంత్రి పడ్డారు. ఆ ప్రయత్నాలు ఫలించి అయ్యన్న కుటుంబం ఇపుడు మేమంతా ఒక్కటేనంటూ రాజకీయ తెరపైకి లేటెస్ట్ గా వచ్చింది. తమ కుటుంబం తాత లచ్చాపాత్రుడు రాజకీయ వారస త్వాన్ని కొనసాగిస్తున్నామని, తమలో ఎటువంటి విభేదాలు లేవని అయ్యన్న స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు. గత కొంతకాలంగా తమ్ముడు సన్యాసిపాత్రుడుతో అయ్యన్నకు పడని సంగతి బహిరంగ రహ్యస్యమే. ఒకానొక దశలో తమ్ముడు వైసీపీలోకి కూడా వెళ్ళాలని చూశారు. తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తే అన్నకే ఎదురు నిలిచి గెలిచి వస్తానని కూడా చెప్పినట్లుగా వార్తాకధనాలు వచ్చాయి. అయ్యన్న రాజకీయ వారసత్వం కోసం కుమారుడు విజయ్, తమ్ముడు సన్యాసిపాత్రుడు గొడవలు పడుతున్న నేపధ్యంలోనే విభేదాలు వచ్చాయి. దీంతో అయ్యన్నకు ఈసారి గడ్డు పరిస్థితులు తప్పవని కూడా అంతా భావించారు. మరో వైపు తమ్ముడు సన్యాసిపాత్రుడు వర్గంగా ఉన్న కౌన్సిలర్లు పలువురు వైసీపీలో చేరిపోయారు. దీంతో అయ్యన్నలో కలవరం చెలరేగింది. ఇదిలా ఉండగా, వైసీపీ నుంచి గట్తి పోటీ ఉన్న వేళ సొంత తమ్ముడే వ్యతిరేకంగా ఉంటే తేడా కొడుతుందేమోనని భావిస్తున్న అయ్యన్న మొత్తానికి దిగి వచ్చి రాజీ కుదుర్చుకున్నారని అంతా భావిస్తున్నారు. అయితే ఈ రాజీ ఎన్నాళ్ళు అన్నది తెలియదు. ఎందుకంటే అయ్యన్న కొడుకుల వైపే ద్రుష్టి పెడుతున్నారు తప్ప తమ్ముడిని ఎదగనీయడంలేదన్న ఆవేదన ఉంది. దాంతో అన్యమనస్కంగానే సన్యాసిపాత్రుడు అన్న పక్కన కూర్చున్నారని అంటున్నారు. ఏది ఏమైనా అన్నదమ్ములు కలసినంతగా విడిపోయిన క్యాడర్ కలవదు. అందువల్ల ఎన్నికల్లో దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది చూడాల్సిందే.
|