సంచలన పరిణామాలకు సుపరిచితమైన కర్నాటక మరోమారు ఆసక్తికర ఎపిసోడ్తో తెరకెక్కింది. ఓవైపు ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి జోరుగా కొనసాగుతుండగా మరోవైపు కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప వేలాది కోట్ల రూపాయల లంచం ఎపిసోడ్ సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ టాప్ నేతలకు కర్నాటక మాజీ సీఎం యడ్డీ సుమారు 1800 కోట్లు లంచంగా ఇచ్చినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై బీజేపీ సైతం అదే రీతిలో ఘాటుగా స్పందించింది.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. యడ్డీ డైయిరీస్ వివరాలంటూ ఆయన సమాచారం బయటపెట్టారు. బీజేపీ సెంట్రల్ కమిటీకి వెయ్యి కోట్లు, ఆర్థిక మంత్రి జైట్లీకి 150 కోట్లు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి 150 కోట్లు, హోంమంత్రి రాజ్నాథ్కు వంద కోట్లు, అద్వాణీ, జోషీలకు చెరో 50 కోట్లు ఇచ్చినట్లు యడ్డీ తన డెయిరీలో రాసుకున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. గడ్కరీ కుమారుడి పెళ్లి కోసం కూడా యడ్డీ పది కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
బీజేపీ కీలక నేతలకు ఎంత ఎంత ఇచ్చారో ఆ అంశాలను యడ్డీ తన డైయిరీలో రాసుకున్నారని, కర్నాటక సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప ఆ సొమ్మును అక్రమంగా పంపిణీ చేశారని, కారవాన్ మ్యాగ్జిన్లో యడ్డీ డెయిరీస్ రిపోర్ట్ వచ్చింది. దాని ఆధారంగానే ఇవాళ కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేసింది. బీజేపీ బడా నేతలకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చిన యడ్డీపై లోక్పాల్ చేత విచారణ చేపట్టాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు. లంచం తీసుకున్నారన్న అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివరణ ఇవ్వాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు.
ఈ ఎపిసోడ్ కలకలం సృష్టించిన నేపథ్యంలో యడ్యురప్ప మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్నారు. కాంగ్రెస్ పార్టీ, దాని నేతలు వింత ఆలోచనలతో దివాళా తీశారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో మైలేజీ కోసమే కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తోందన్నారు. మోడీ పాపులారిటీని చూసి వాళ్లు తట్టుకోలేకపోతున్నారని, కారవాన్ రిపోర్ట్ నిజం కాదు అని ఇప్పటికే ఐటీశాఖ నిరూపించిందని యడ్యూరప్ప అన్నారు.