దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నెల 18వ తేదీన నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రేపటి నుంచి 27వ తేదీ వరకు నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. తరువాత 28వ తేదీన నామినేష్ల ఉపసంహరణకు తుది గడువు ఉంది. ఏపీలో ఇప్పటికే కీలక నేతలందరూ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక తెలంగాణలో మొత్తం 17శాసనసభ స్థానాలకు ఇప్పటివరకు 220మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా మంగళవారం నుంచి అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. 28వ తేది మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా, అసంపూర్తిగా ఉన్న నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తారు. ఉపసంహరణ గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు.
నిజామాబాద్లో కవితకు వ్యతిరేకంగా బరిలోకి దిగాలన్న నిర్ణయంతో 50 మంది రైతులు నామినేషన్ వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరపున కుప్పంలో ఆయన భార్య నామినేషన్ దాఖలు చేశారు. జగన్మోహన్రెడ్డి పులివెందులలో దాఖలు చేశారు. పవన్కల్యాణ్ గాజువాక, భీవమరంలో నామినేషన్లు దాఖలు చేశారు. దాదాపు వేయికిపైగా ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది. ఇక, నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసే వారితో ఆయా కార్యాలయాలు పోటెత్తుతాయని భావిస్తున్నారు. వచ్చే నెల 11 తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి.
తొలి దశలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పాటు, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్ల పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల వ్యయం ఎక్కువగా ఉంటుందని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రానికి 75మంది ఎన్నికల పరిశీలకులను, 13మంది పోలీస్ పరిశీలకులు పంపినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు.