ఊహించిందే నిజమైంది. మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పలు ప్రశ్నలతో తెలంగాణ కేసీఆర్కు వివేక్ బహిరంగ లేఖ రాశారు. ప్లాన్ ప్రకారమే తాను పోటీ చేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరి క్షణంలో టికెట్ నిరాకరించారని ఆరోపించారు. టికెట్ హామీ ఇచ్చి కూడా తనను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారని అన్నారు. కేసీఆర్ ఆటబొమ్మలు కొందరు తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయిందన్న వివేక్.. తన తండ్రి కాకా, తాను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చానని.. తెలంగాణ కోసం పనిచేయడం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడడమే పార్టీకి ద్రోహం చేయడమా? అని ప్రశ్నించారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్ఠం చేయడానికి పనిచేయడమే తన తప్పా అని ప్రశ్నించిన వివేక్.. 2014లో టీఆర్ఎస్లో ఇద్దరు ఎంపీలే ఉంటే తాను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే ద్రోహమా? అని అన్నారు.
ప్రభుత్వ సలహాదారుడిగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారాయన. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం చేయనివాళ్లకు టికెట్లిచ్చారని అన్నారు. తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినవాళ్లే ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉండడం బాధిస్తోందన్నారు వివేక్. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వ పోకడలను ప్రజల మీద రుద్దుతున్నారని.. ఈ విషయాన్ని ప్రజలు త్వరలోనే గుర్తిస్తారని అన్నారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసినా.. ప్రజల మధ్యే ఉంటానని స్పష్టం చేశారు.
కాగా, వివేక్ రాజీనామాతో ఆయన సారథ్యంలోని రెండు మీడియా సంస్థలు టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకించే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా దళితుల్లోని ఓ బలమైన సామాజిక వర్గం సైతం తమ అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చని కొందరు చెప్తున్నారు. వివేక్ చేరబోయే పార్టీని బట్టి రాజకీయ సమీకరణాలు మారవచ్చని తెలుస్తోంది.