ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో నిందారోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఆయన సీఎం పీఠంపై కూర్చోవడం అనే విషయంలో అనేక విమర్శలు ఉండగా....తాజాగా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం నిన్న అమరావతి చేరుకున్న ఫరూఖ్ అద్బుల్లా... ఇవాళ చంద్రబాబుతో కలిసి కడపలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పదవి కట్టబెడితే రూ.1500 కోట్లు ఇస్తానని కాంగ్రెస్ అధిష్ఠానానికి వైఎస్ జగన్ ఆఫర్ చేశాడని ఆరోపించారు.
జగన్ ఇలాకాలో ఫరూఖ్ మాట్లాడుతూ, అవినీతి సొమ్ముతో సీఎం పీఠం ఎక్కాలని చూసిన జగన్ను ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్ అంధకారమవుతుందని అన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత సీఎం పదవి కట్టబెడితే రూ.1500 కోట్లు ఇస్తానని కాంగ్రెస్ అధిష్ఠానానికి వైఎస్ జగన్ ఆఫర్ చేశాడని ఆరోపించారు. జగన్కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీఎం కావడానికి జగన్ ఎంతకైనా తెగిస్తాడని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలతో కోట్లు సంపాదించి పదవులు దక్కించుకుందామంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న ఫరూఖ్.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం తాపత్రయపడే సీఎం చంద్రబాబునే తిరిగి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదిలాఉండగా, టీడీపీ తరపున జాతీయ నేతలను రంగంలోకి దింపి చంద్రబాబు ప్రచారం చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రచారం నిర్వహించిన తొలి నేత అయిన ఫరూఖ్ జగన్ను టార్గెట్ చేయడం, ఏకంగా సీఎం పీఠం విషయంలో కలకలం రేకెత్తించే కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.