టీఆర్ఎస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక హామీ ఇచ్చారు. ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 66 ఏళ్లు పాలించిన పార్టీలే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని విమర్శించారు. ``1947 నుంచి కాంగ్రెస్ నేతలు గరీబీ గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ కాలం నుంచి పేదరికాన్ని పారదోలుతామని చెబుతున్నారు. తరాలు మారినా కాంగ్రెస్ నేతల గరీబీ హఠావో నినాదం కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీలు క్రియారహిత పాలన చేశాయి`` అని ఆరోపించారు.
దేశ భవిష్యత్ను నిర్ణయించడంలో లోక్సభ ఎన్నికలు కీలకమైనవని కేసీఆర్ అన్నారు.జాతిని చైతన్యవంతం చేయడంలో తెలంగాణ ప్రజలు కీలకపాత్ర పోషించాలని కోరారు. భవిష్యత్లో టీఆర్ఎస్ నేతలు కీలక పదవులు పొందుతారు. టీఆర్ఎస్ నేతలు గవర్నర్లు, విదేశీ రాయబారులు అయ్యే రోజులు వస్తాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీతారామ ప్రాజెక్టుతో రెండు పంటలకు నీరు అందుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను కచ్చితంగా సాధించుకుంటామన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా కష్టాలు తీరతాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి ప్రభుత్వం వస్తేనే దేశం బాగుపడుతుంది. సొంత ఇంటిస్థలం ఉన్న వారికి రెండు పడక గదుల ఇంటి కోసం నిధులు ఇస్తాం. ఎన్నికల తర్వాత నర్సరీ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. సుబాబుల్ రైతుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాగా, కేసీఆర్ చేసిన ప్రకటన పార్టీ నేతల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.